రాధేశ్యామ్.. మళ్లీ కొత్తగా

సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించింది యువి క్రియేషన్స్. కరోనా కేసులు పెరుగుతున్నా.. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిపోయినా.. తమ సినిమాను థియేటర్లలోకి దించాల్సిందే అని ఒక దశలో పట్టుదలతో ఉన్నారు. కానీ చివరికి కొవిడ్ ప్రభావం బాగా పెరిగిపోవడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని.. థియేటర్లను బుక్ చేసుకుని.. ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టాక ఇలా సినిమాను వాయిదా వేసుకోవాల్సి రావడం ఎంత ఇబ్బందికరమో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఐతే కొవిడ్ కాలంలో ఇలాంటి ఇబ్బందులు మామూలైపోయాయి. అదృష్టవశాత్తూ థర్డ్ వేవ్ మరీ ఎక్కువ రోజులు కొనసాగకపోవడంతో ఇప్పుడిక మళ్లీ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి 11నే రాధేశ్యామ్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే.ఐతే ఆల్రెడీ ఫస్ట్ కాపీ తీసేశాక ఇక సినిమాను ముట్టుకోవాల్సిన పని ఉండదనే అనుకుంటారంతా.

కానీ దర్శకుడు రాధాకృష్ణకుమార్, ఎడిటర్ కలిసి మళ్లీ కత్తెరకు పని చెబుతున్నట్లు సమాచారం. సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, కొన్ని చోట్ల సినిమా డ్రైగా తయారవడంతో మళ్లీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నట్లు తెలిసింది. జనవరిలో ట్రైలర్ లాంచ్ చేసినపుడు.. అది మరీ లెంగ్తీగా ఉందన్న కంప్లైంట్లు వచ్చాయి. ట్రైలరే అలా ఉంటే సినిమా సంగతేంటో అన్న కామెంట్లు కూడా వినిపించాయి.

ఈ నేపథ్యంలో సినిమా వాయిదా పడ్డాక కొందరు ప్రముఖులకు స్పెషల్ షోలు వేసి ‘రాధేశ్యామ్’ను చూపించారని.. వాళ్లు చెప్పిన సూచనల మేరకు ఎడిటింగ్ పరంగా కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం. ముందు అనుకున్న దానితో పోలిస్తే తక్కువ నిడివితో సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట. ప్రభాస్ ఇమేజ్‌కు భిన్నంగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేస్తుందో అన్న సందేహాలు ట్రేడ్ వర్గాల్లో ఉన్న మాట వాస్తవం.