టికెట్ల రేట్లు పెంచితే న‌ష్ట‌మొచ్చింది-త‌మ్మారెడ్డి

సినిమా టికెట్ల రేట్లు, ఆన్ లైన్ టికెటింగ్, ఇత‌ర అంశాల‌పై ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్ర‌తినిధుల బృందం గురువారం కీల‌క స‌మావేశంలో పాల్గొన‌బోతుండ‌గా.. టాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ విలేక‌రుల స‌మావేశం పెట్టి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టికెట్ల రేట్ల పెంపుపై ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టికెట్ల రేట్లు పెంచితే సినిమాల‌కు మంచి జ‌రుగుతుంద‌నుకోవ‌డం పొర‌పాటేన‌ని త‌మ్మారెడ్డి అన్నారు.

తెలంగాణ‌లో టికెట్ల ధ‌ర‌లు పెంచ‌డం వ‌ల్ల అర్జున ఫ‌ల్గుణ సినిమా దారుణంగా దెబ్బ తింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. బంగార్రాజు సినిమాకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టికెట్ల రేట్లు త‌క్కువ ఉన్న‌ప్ప‌టికీ మంచి లాభాలు వ‌చ్చాయ‌ని, తెలంగాణ‌లో రేట్లు ఎక్కువ ఉన్నా ఈ చిత్రానికి అనుకున్నంత ఆదాయం రాలేద‌ని.. ఒక్క ఏపీలో టికెట్ల రేట్లు త‌క్కువ ఉండ‌టం వ‌ల్ల సినిమాల రెవెన్యూకు పెద్ద ఇబ్బందేమీ లేద‌ని త‌మ్మారెడ్డి వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. 

ఇండ‌స్ట్రీలో ప్ర‌ధాన స‌మ‌స్య ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ పెరిగిపోవ‌డ‌మే అని.. అలా అని హీరోలంతా పారితోష‌కాలు త‌గ్గించుకోవాల‌ని తాను అన‌న‌ని.. కానీ విలాసాల‌కు అయ్యే ఖ‌ర్చులు త‌గ్గించాల‌ని త‌మ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత‌కుముందు చిరంజీవి ఒక్క‌డే వెళ్లి ఏపీ సీఎంను క‌ల‌వ‌డం ప‌ట్ల అభ్యంత‌రాలేమీ లేవ‌ని త‌మ్మారెడ్డి అన్నారు. ఆయ‌న్ని పిలిచారు కాబ‌ట్టి ఆయ‌న వెళ్లాడ‌ని, ఒక్క‌డే వెళ్లినా అంతా క‌లిసి వెళ్లినా అది ఇండ‌స్ట్రీ కోస‌మే క‌దా అని త‌మ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

ఆన్ లైన్ టికెటింగ్ విధానం వ‌ల్ల అంద‌రికీ మంచిదే అని.. నిర్మాత‌ల‌కు రావాల్సిన ఆదాయం నిర్మాత‌ల‌కు, ప్ర‌భుత్వానికి రావాల్సిన ఆదాయం ప్ర‌భుత్వానికి వ‌స్తుందని త‌మ్మారెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. నంది అవార్డుల‌కు క‌మిటీలు వేసి పుర‌స్కారాలు ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పిన రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలూ ఆ విష‌యాన్ని త‌ర్వాత ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని.. అవార్డులు ఎందుకు ఇవ్వ‌ట్లేద‌ని త‌మ్మారెడ్డి ప్ర‌శ్నించారు.