అలియాభట్ సినిమా ఓటీటీ రిలీజ్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ ఇప్పుడు సౌత్ సినిమాలపై కూడా దృష్టి పెట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సీత క్యారెక్టర్ పోషించిన ఆమె ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో నటించబోతుందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో అలియాను హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఈ మేరకు సంప్రదింపులు కూడా అయినట్లు ఇటీవల అలియా వెల్లడించింది. కాబట్టి ఎన్టీఆర్-అలియా కాంబో పక్కా అని తెలుస్తుంది. 

ఇదిలా ఉండగా.. బాలీవుడ్ లో ఈ బ్యూటీ నటించిన ‘గంగూబాయి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నిన్ననే ఈ సినిమా ట్రైలర్ రిలీజయింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో కూడా సినిమాను రిలీజ్ చేయనున్నారు. దానికి తగ్గట్లే తెలుగు మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తోంది అలియా. 

అయితే ఇప్పుడు ఈ బ్యూటీ నటించిన మరో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. జస్మీత్ కె రీన్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నిర్మాతగా ‘డార్లింగ్స్’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో అలియాభట్ లీడ్ రోల్ పోషించింది. ఆమెతో పాటు విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ, షెఫాలీ షా లాంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో నటించడంతో పాటు కో-ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తోంది అలియా. 

ఇప్పడు ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్, జీ5 లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ ల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. త్వరలోనే డీల్ ఫైనల్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్లో కంటే ఓటీటీలో రిలీజ్ చేయడం బెటర్ అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.