తెలుగు సినిమా హవాకు ఇది నిదర్శనం

కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమలు దారుణంగా దెబ్బ తిన్నాయి. 2020లో కరోనా మొదలైన దగ్గర్నుంచి ఎక్కువ కాలం మూత పడి ఉన్న పరిశ్రమ అంటే.. అది ఫిలిం ఇండస్ట్రీనే. ఇండియాలో సినీ పరిశ్రమ ఎంతగా కరోనా ధాటికి విలవిలలాడిందో తెలిసిందే. ఐతే దేశంలో మిగతా పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ మాత్రం ఎంతో నయం అనే చెప్పాలి. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ పుంజుకున్న తీరుకు దేశంలోని మిగతా ఇండస్ట్రీలన్నీ  షాకయ్యాయి.

సెకండ్ వేవ్ తర్వాత కూడా మన పరిశ్రమ గొప్పగా పుంజుకుంది. గత రెండేళ్లలో వివిధ భాషల చిత్రాలను థియేటర్లకు వెళ్లి చూసిన ప్రేక్షకుల సంఖ్యకు సంబంధించి గణాంకాలు తాజాగా బయటికి వచ్చాయి. అవి చూస్తే కరోనా దెబ్బను తట్టుకుని తెలుగు సినిమా ఏ స్థాయిలో సత్తా చూపించిందో అర్థమైపోతుంది. ఇండియాలోనే అతి పెద్ద ఇండస్ట్రీ అయిన బాలీవుడ్‌ను మంచి తెలుగు సినిమా ఆదరణ దక్కించుకోవడం విశేషం.

2018-19 సంవత్సరాలకు బాలీవుడ్ సినిమాలకు థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ 65.7 కోట్లు కాగా.. 2020-21 సంవత్సరాలకు అది 10.6 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో తమిళ చిత్రాలకు ఫుట్ ఫాల్స్ 36.2 కోట్లు-14.4 కోట్లుగా ఉన్నాయి. కానీ తెలుగు సినిమాల విషయానికి వస్తే 2018-19కి 36.8 కోట్లుగా ఉన్న ప్రేక్షకుల సంఖ్య.. 2021-22కి 23.4 కోట్లకు తగ్గింది. కానీ వేరే ఇండస్ట్రీలతో పోలిస్తే కరోనా టైంలో మన ప్రేక్షకుల సంఖ్య చాలా ఎక్కువ.

హిందీతో పోలిస్తే తెలుగు సినిమాలను చూసిన ప్రేక్షకుల సంఖ్య రెట్టింపుగా ఉండటం విశేషం. ఇండియాలో మిగతా భాషలతో అయితే మన సినిమాలకు పోలికే లేదు. కరోనా దెబ్బకు 2021-22 కాలానికి మలయాళంలో 5.1 కోట్లకు, కన్నడలో 5.4 కోట్లకు, పంజాబీలో 1.1 కోట్లకు, మరాఠీలో 40 లక్షలకు, బెంగాలీలో 40 లక్షలకు ప్రేక్షకుల సంఖ్య పడిపోయింది. అలాంటిది మన సినిమాలను 23.4 కోట్ల మంది చూశారంటే తెలుగు సినిమా సత్తా ఏంటో.. మన వాళ్లకు సినిమాల మీద ఉన్న ఇష్టం ఎలాంటిదో అర్థమైపోతుంది.