మ‌రో తెలుగు సినిమా.. డైరెక్ట్ ఓటీటీ

ఓటీటీ.. ఓటీటీ.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ‌. లాక్ డౌన్ నడుస్తుండటంతో మూడు నెలలుగా థియేటర్లు మూత పడి ఉన్నాయి. ఇంకో మూణ్నాలుగు పాటు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త సినిమాల్ని నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేయడానికి జోరుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ‘అమృతారామ్’ అనే ఓ చిన్న సినిమాను రెండు నెలల కింద‌ట రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటుగా స‌త్య‌దేవ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఉగ్ర‌రూప‌స్య చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్‌లోకి తేవ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ విష‌యాన్ని అధికారికంగానే ప్ర‌క‌టించారు. రిలీజ్ డేట్ మాత్ర‌మే తేలాల్సి ఉంది. ఇప్పుడు మ‌రో సినిమా ఓటీటీ రిలీజ్ క‌న్ఫ‌మ్ అయింది. అది కూడా స‌త్య‌దేవ్ సినిమానే కావ‌డం విశేషం.

స‌త్య‌దేవ్ హీరోగా ప్ర‌దీప్ మ‌ద్దాలి అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించిన థ్రిల్ల‌ర్ మూవీ 47 డేస్ త్వ‌ర‌లోనే జీ5లో రిలీజ్ కానుంది. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేశారు. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నారు. దాదాపు ఏడాది కింద‌టే ఈ చిత్రం పూర్త‌యింది. విడుద‌ల విష‌యంలో స‌మ‌స్య‌లెదుర్కొంది. ఇక రిలీజ్ కాదేమో అనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసి ఓ ప‌నైపోయింది బాబూ అనిపిస్తున్న‌ట్లుగా ఉంది. కొన్ని రోజులుగా ఓటీటీల్లో వ‌రుస‌గా కొత్త సినిమాలు రిలీజ‌వుతున్నాయి. గ‌త నెల చివ‌ర్లో జ్యోతిక త‌మిళ‌ సినిమా పొన్ మ‌గ‌ల్ వందాల్ రిలీజ్ కాగా.. శుక్ర‌వార‌మే హిందీ మూవీ గులాబో సితాబోను విడుద‌ల చేశారు. 19న కీర్తి సురేష్ మూవీ పెంగ్విన్ రానుంది. కన్నడ సినిమాలు ‘లా’, ‘ఫ్రెంచ్ బిరియాని’ మ‌ల‌యాళ చిత్రం ‘సుఫియుం సుజాతయుం’, హిందీ మూవీ ‘శకుంతలా దేవి’ కూడా త్వ‌ర‌లోనే అమేజాన్ ప్రైంలోకి రానున్నాయి.