ఒక్క సినిమాతో అగ్రిమెంట్ల రేంజికి..

ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన హీరో హీరోయిన్ల జాబితా కాస్త పెద్దదే. ముఖ్యంగా హీరోయిన్లు తొలి సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకుని, ఆ చిత్రం విజయవంతం అయితే ఆటోమేటిగ్గా బిజీ అయిపోతుంటారు. ఇప్పుడు కన్నడ అమ్మాయి శ్రీలీల కూడా ఇలాగే టాలీవుడ్లో  మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఆమె ‘పెళ్ళిసంద-డి’ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన సంగతి తెలిసిందే.

నిజానికి ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యంత పేలవమైన  చిత్రాల్లో ‘పెళ్ళిసంద-డి’ ఒకటి. అయినా సరే.. అది బాక్సాఫీస్ దగ్గర విజయవంతమైంది. అందుక్కారణం.. పాటలు, అలాగే హీరో హీరోయిన్ల అందం, పెర్ఫామెన్స్, వాళ్లిద్దరి కెమిస్ట్రీ అనే చెప్పాలి. దసరా టైంలో రిలీజ్ కావడం కూడా దీనికి కలిసొచ్చింది. ‘పెళ్లిసందడి’ విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షించిన శ్రీ లీల.. రిలీజ్ తర్వాత అందరి నోళ్లలోనూ బాగా నానింది.

ముఖ్యంగా ఇండస్ట్రీలో పేరున్న పేరున్న నిర్మాణ సంస్థల కళ్లల్లో పడటం ఆమె కెరీర్‌ను మార్చేస్తోంది.ఇప్పటికే మాస్ రాజా రవితేజతో ‘ధమాకా’ సినిమాలోనటిస్తోంది శ్రీలీల. ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రీకరణలోనూ పాల్గొంది. మరోవైపు ఇటీవలే ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి రెండో సినిమా ‘సెల్ఫిష్’కు శ్రీలలనే కథానాయికగా ఖరారు చేశారు. దీని గురించి కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది. కాగా ఇప్పుడు శ్రీలీలకు ఒకేసారి రెండు మంచి ఆఫర్లు తగిలినట్లు సమాచారం.

ఒకే నిర్మాణ సంస్థలో రెండు చిత్రాలకు ఆమె సంతకం చేసింది. ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్‌తో ఆమెకు అగ్రిమెంట్ జరిగినట్లు సమాచారం. ఎన్ని సినిమాలకు అన్నది తెలియదు కానీ.. ప్రస్తుతానికి ఆ బేనర్లో శ్రీలీల రెండు సినిమాల్లో కథానాయికగా చేయబోతోందట. నవీన్ పొలిశెట్టి సినిమా ‘అనగనగా ఒక రాజు’తో పాటు వైష్ణవ్ తేజ్ హీరోగా రాబోతున్న ఒక క్రేజీ మూవీలోనూ శ్రీలీల నటించబోతోంది. ఒక్క సినిమాతో ఇలా పెద్ద బేనర్లో అగ్రిమెంట్ చేసుకునే రేంజికి రావడమంటే విశేషమే.