‘సెన్సార్’ నష్టం అక్షరాల రూ.40 వేల కోట్లు

సినిమాలకు సంబంధించిన అశ్లీలతకు చెక్ చెప్పడానికి సెన్సార్ అన్నది ఒకటి ఉన్న విషయం తెలిసిందే. తరచూ సినిమా పరిశ్రమ ఎదుర్కొనే ఈ సెన్సార్ చిక్కులపై పలువురు దర్శక నిర్మాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. సినీ పరిశ్రమకు ఉండే సెన్సార్.. వెబ్ కంటెంట్ విషయంలో కాస్త తక్కువే. కాకుంటే.. ఇంటర్నెట్ సెన్సార్ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సమస్యలకు కారణమవుతోంది. ఈ మధ్యన రాజకీయ కారణాలతోపాటు.. శాంతిభద్రతల బూచి చూపించి ఇంటర్నెట్ వినియోగం మీద ఆంక్షల్ని విధిస్తున్నారు. దీంతో గ్లోబల్ ఎకానమీకి జరుగుతున్న నష్టం భారీగా ఉంటోంది. దీనికి సంబంధించిన ఒక నివేదిక తాజాగా బయటకు వచ్చింది. అందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. సెన్సారింగ్ తో జరుగుతున్న నష్టం ఇంత భారీగా ఉందా? అన్న భావన కలుగక మానదు.

గత ఏడాదిలో ఇంటర్నెట్ సెన్సార్ షిప్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం రూ.40వేల కోట్లుగా చెబుతున్నారు. డిజిటల్ సెక్యూరిటీ అండ్ రైట్స్ గ్రూప్ టాప్ 10 వీపీఎన్ రిపోర్టు ప్రకారం.. రూ.40వేల కోట్లకు పైనే నష్టం వాటిల్లినట్లుగా లెక్క కట్టారు. ఇటీవల కాలంలో ఇంటర్నెట్ సెన్సారింగ్ ఎక్కువ అవుతోంది. తరచూ ఏదో ఒక అంశం మీద కొన్నిచోట్ల ఆంక్షల్ని విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇంటర్నెట్ ఆంక్షల కారణంగా ఎక్కువ నష్టం జరిగింది మయన్మార్ దేశంలోనే. మొత్తం నష్టంలో సింహభాగం ఈ దేశానికి సంబంధించే.  ఒక అంచనా ప్రకారం రూ.18 వేల కోట్లకు పైనే నష్టపోయినట్లుగా చెబుతున్నారు.మిలిటరీచర్యల వల్ల ఈ నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. తర్వాతి స్థానం నైజీరియాది. గత జూన్ లో ట్విటర్ ను ఈ దేశంలో బ్లాక్ చేయటం వల్ల చోటు చేసుకున్న పరిణామాలతో దాదాపు రూ.10వేల కోట్ల మేర నష్టం వచ్చినట్లుగా చెబుతున్నారు.
 భారత్ లోనూ కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనల వల్ల కోసం నష్టం వాటిల్లుతుందని.. పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ మీద నిషేధాన్ని విధించటం.. ఆంక్షల్ని అమలు చేయటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. దీని వల్ల జరిగిన నష్టం ఎంతన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇంటర్నెట్ ఆంక్షలతో 2020లో 268 మిలియన్ ప్రజలు ఇబ్బంది పడితే.. 2021లో ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 468 మిలియన్ల మంది ఇబ్బంది పడ్డారు.

అంటే.. ఏడాది వ్యవధిలో ఆంక్షల చట్రంలోకి వచ్చిన వారి సంఖ్య 81 శాతానికి పెరిగిందన్న మాట. ఇందులో ప్రభుత్వ ఆంక్షలతో వాటిల్లిన నష్టం 36 శాతంగా చెబుతున్నారు. ఇంతకీ.. ఈ నష్టం ఎలా వస్తుంది? అన్న సందేహం రావొచ్చు. ఇంటర్నెట్ ఆంక్షల వల్ల జరిగే నష్టం.. ఇంటర్నెట్ బ్రౌజింగ్.. ఇతరత్రా సేవలతో పాటు యాడ్స్.. కస్టమర్ సోపోర్టు సేవలకు విఘాతం కలుగుతుంది. ప్రత్యేకించి సోషల్ మీడియా ఆగిపోవటం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది.కొత్త సంవత్సరం మొదలై పది రోజులే అయ్యింది. కానీ.. కొత్త ఏడాదిలోనూ ఇంటర్నెట్ ఆంక్షలు అప్పుడే మొదలయ్యాయి. కజకిస్తాన్.. సూడాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభాల కారణంగా ఇంటర్నెట్ షట్ డౌన్ నడుస్తోంది. కొత్త ఏడాదిలో నష్టం అప్పుడే మొదలైందన్న మాట. వీటి కారణంగా జరుగుతున్న నష్టం ఎంతన్న దానిపై లెక్కలు బయటకు రావాల్సి ఉంది.