‘ఆర్య’కు బన్నీ, దేవిలే ఎందుకంటే..?

ఆర్య సినిమా టాలీవుడ్లో ఒక సెన్సేషన్. స్టోరీ పరంగా చూసినా, టేకింగ్‌లో అయినా, హీరో పెర్ఫామెన్స్ సంగతి చూసినా, మ్యూజిక్ పరంగా తీసుకున్నా.. ఇది ట్రెండ్ సెట్టింగ్ మూవీ అనడంలో మరో మాట లేదు. ఈ సినిమాతో దర్శకుడిగా సుకుమార్, హీరోగా అల్లు అర్జున్, సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఇప్పుడు చూసినా ఫ్రెష్‌గా, ట్రెండీగా అనిపించే మూవీ అది. హీరోగా తొలి సినిమా ‘గంగోత్రి’తో హిట్ అయితే కొట్టాడు కానీ.. ఆ సినిమాలో నటన, లుక్స్ పరంగా అల్లు అర్జున్‌ అంతగా ఆకట్టుకోలేదు.

‘ఆర్య’ చూశాక మాత్రం అతడి మీద ఉన్న అభిప్రాయాలు మారిపోయాయి. ఇక ఈ చిత్రంలో దేవి మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమా సందర్భంగా బన్నీ, దేవిలతో గొప్ప అనుబంధం ఏర్పడింది సుక్కుకు. మరి దర్శకుడిగా తన తొలి సినిమా కోసం వీళ్లనే ఎందుకు సుకుమార్ ఎంచుకున్నాడన్నది ఆసక్తికరం.
ఈ విషయమే ‘అన్ స్టాపబుల్’ షోకు అతిథిగా వచ్చిన సుకుమార్‌ను బాలయ్య అడిగాడు.

వీళ్లతో మీకెలా కనెక్టయింది.. ఎందుకు వాళ్లను ‘ఆర్య’ కోసం తీసుకున్నారు అని అడగ్గా.. సుక్కు సమాధానం చెప్పాడు. సుకుమార్ దర్శకుడు కావడానికి ముందు వి.వి.వినాయక్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాడు. అలా పని చేసిన చిత్రాల్లో ‘దిల్’ ఒకటి. ఈ సినిమా సూపర్ హిట్టయింది. రిలీజ్ తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా.. ఆ వేడుకకు అల్లు అర్జున్ వచ్చాడట. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజుకు అప్పటికే ‘ఆర్య’ కథ చెప్పి ఓకే చేసుకున్న సుకుమార్.. హీరో కోసం వెతుకుతుండగా.. ఆ ఫంక్షన్లో చాలా హుషారుగా అందరితో మాట్లాడుతూ సందడి చేస్తున్న బన్నీని చూశాడట.

వెంటనే వెళ్లి దిల్ రాజు దగ్గర ‘‘ఇతనే నా ఆర్య’’ అనేశాడట. అలా హీరో ఓకే అయ్యాడు. ఇక సంగీత దర్శకుడి విషయానికి వస్తే.. తనకు మ్యూజిక్ మీద పెద్దగా అవగాహన లేదని, కాబట్టి పేరున్న సంగీత దర్శకుడిని తీసుకుంటే ఏమైనా చెప్పాలన్నా ఇబ్బందే అని, అందుకే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుందని అనుకున్నానని.. అప్పటికే ‘ఆనందం’ సినిమా రిలీజై పాటలు తనకు బాగా నచ్చడంతో దేవిని ఎంచుకున్నానని.. అతడితో తనకు బాగా సింక్ అయిందని. . తన ఆలోచనల్ని వెంటనే గ్రహించి వేగంగా ట్యూన్ ఇచ్చేస్తాడని.. అందుకే ఇప్పటికీ అతడితోనే తన జర్నీని కొనసాగిస్తున్నానని సుక్కు వెల్లడించాడు.