బాలీవుడ్ లో ‘అఖండ’.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో హిట్ అయిన చాలా సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇక్కడ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేస్తే.. భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు రెండొందల కోట్లు రాబట్టింది. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాను కూడా రీమేక్ చేశారు. ఇప్పుడు బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా కూడా బాలీవుడ్ కి వెళ్లబోతుందని సమాచారం. కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన వార్తలు వస్తుండగా.. తాజాగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

బాలీవుడ్ లో ‘అఖండ’ సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఒకవేళ రీమేక్ చేస్తే.. అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ నటిస్తే బాగుంటుందని అన్నారు. అంతేకాదు.. ‘అఖండ 2’ సినిమాకి కూడా స్కోప్ ఉందని అన్నారు. ‘అఖండ 2’ వస్తే బాగుంటుందని.. కానీ బోయపాటి శ్రీను మైండ్ లో ఏముందో తెలియదని అన్నారు.

ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే బయ్యర్లు లాభాల బాట పడతారనే విషయం తనకు ముందే తెలుసునని.. అలానే అయిందని చెప్పారు. కానీ ఓవర్సీస్ లో ఇంతటి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని చెప్పారు. బాలకృష్ణ లాంటి హీరోతో పని చేయడం గొప్ప అవకాశమని.. ఫ్యూచర్ లో ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుందని అన్నారు.

రీసెంట్ గానే ‘అఖండ’ సినిమా 25 రోజుల సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. చాలా కాలం తరువాత ఈ సినిమాలో బాలయ్య నటవిశ్వరూపం చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేస్తున్నారు.