బాలకృష్ణ అలక.. అసలు కథ ఇదీ

లేక లేక టీవీ ఛానెళ్లకు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే అనేక వివాదాస్పద కామెంట్లు చేశారు. అనేక అంశాలపై స్పందించారు.

తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఎయిటీస్ రీయూనియన్ కార్యక్రమానికి తనను పిలవకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరు ఇంట్లో ఈ వేడుక జరిగితే తనను పిలవకపోవడం ఏంటని ఆయనన్నారు. తనను ఇగ్నోర్ చేస్తే పూర్తిగా ఇగ్నోర్ చేయాలన్న కామెంట్ కూడా చేశారు. అందరితో చాలా మర్యాదగా వ్యవహరించే చిరు.. ఇలా బాలయ్యను ఎలా విస్మరించాడనే ప్రశ్న అందరిలోనూ ఉదయించింది. కానీ దీని వెనుక వేరే కథ ఉంది.

2015లో ఈ రీయూనియన్ సందర్భంగా ఒక చిన్న ఇబ్బంది చోటు చేసుకుంది. దాని గురించి బాలయ్యే గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందరూ కలిసి గ్రూప్ ఫొటో దిగుతుండగా.. కొందరు కుర్చీల్లో పైన కూర్చుంటే.. కొందరు కింద కూర్చున్నారట. ఐతే ఆ ఫొటో దిగబోతుండగా.. రజనీ కాంత్ గ్రూప్‌లోకి రావడంతో కింద ఉన్న సుహాసిని ‘రజనీసార్ వస్తున్నారు. బాలయ్యా కిందకు వచ్చేయ్’ అన్నారట.

ఇది బాలయ్యకు ఆగ్రహం తెప్పించింది. అందరూ ఒక్కటే అని కలుస్తున్నపుడు.. ఇలా రజనీ సార్ వచ్చారు కిందికి రా అనడం ఏంటి అన్నది బాలయ్య అభ్యంతరం. ‘‘అందరం ఒకటనుకుని కలిస్తే తేడాలు చూపించేసరికి నాకు కోపం వచ్చింది. ‘రజనీ సారేంటి? ఎవడు సూపర్ స్టార్?’’ అని అరిచా. ‘ఫొటో తియ్యండి’ అన్నా. అయ్యాకే కిందికి వచ్చా. నేను పర్ఫెక్షనిస్ట్‌ని. నా చుట్టూ అందరూ అలానే ఉండాలనుకుంటా. లేకపోతే కోపం వస్తుంది’’ అని నాటి అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు బాలయ్య. ఇది జరిగిన తర్వాత ఇటు బాలయ్య కానీ, అటు రజనీ కానీ ఈ రీయూనియన్ కార్యక్రమానికి రాలేదు. ఈ క్రమంలోనే చిరు కూడా బాలయ్యను పిలవడం మానేసి ఉంటారేమో.