విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఆయన కథను ఓకే చేసి మీడియాలో ప్రాజెక్టు గురించి వార్త కూడా వచ్చాక ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. తేజతో సావిత్రి, త్రివిక్రమ్తో ఒక సినిమా.. ఇలా ఈ జాబితాలో చాలా చిత్రాలే కనిపిస్తాయి. చివరగా వెంకీ ఇలా క్యాన్సిల్ చేసిన మూవీస్లో త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రం కూడా ఒకటి.
సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా చిత్రాలతో వరుస హిట్లు కొట్టాక వెంకీ లాంటి పెద్ద స్టార్తో సినిమా చేసే అవకాశం వచ్చింది.
వీరి మధ్య కొన్ని నెలల పాటు కథా చర్చలు జరిగాయి. సినిమా ఓకే అయిపోయిందని, ఇక సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఏమైందో ఏమో.. ఆ సినిమా ముందుకు కదల్లేదు. వీళ్లిద్దరూ వేర్వేరు సినిమాల వైపు వెళ్లిపోయారు. ఈ చిత్రం ఎందుకు ఆగిపోయిందో ఒక ఇంటర్వ్యూలో త్రినాథరావు వెల్లడించాడు.
“నా రెగ్యులర్ రైటర్ ప్రసన్న కుమారే వెంకటేష్ సినిమాకు కూడా స్క్రిప్టు అందించాడు. అది ఆయనకు బాగా నచ్చింది. ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైట్ అయ్యారు. తన క్యారెక్టర్ను బాగా మైండ్లోకి ఎక్కించేసుకున్నారు. ఆయన ఎంతగా ఎగ్జైట్ అయ్యారంటే.. తన పాత్ర గురించి నాతో ఫోన్లో డిస్కస్ చేసేవారు. ఒక రోజు ఆయన నటిస్తున్న వేరే సినిమా షూటింగ్కు వెళ్తే అక్కడ కూడా మా సినిమా క్యారెక్టర్కి సంబంధించి మేనరిజమ్స్, డైలాగులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఆయన అంత బాగా ఈ కథ, పాత్రతో కనెక్ట్ అయ్యారు.
ఐతే స్క్రిప్టు అంతా ఓకే అనుకున్నప్పటికీ.. ఫ్లాష్ బ్యాక్ విషయంలో మాత్రం వెంకీ గారు కన్విన్స్ కాలేదు. నాకు కూడా ఆ పాయింట్ నచ్చలేదు. దాని మీద వర్క్ చేయమన్నారు. ఐతే అది ఎంతకూ తెగలేదు. దీంతో సినిమా అనుకున్న సమయానికి ముందుకు కదల్లేదు. ఆ తర్వాత ఇలాంటి కథతోనే వేరే హీరో సినిమా చేయడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు” అని త్రినాథరావు తెలిపారు. వెంకీ సినిమా క్యాన్సిలయ్యాక మజాకా సినిమా తీసి ఫ్లాప్ ఎదుర్కొన్న త్రినాథరావు ప్రస్తుతం హవీష్ హీరోగా నేను రెడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates