థియేటర్లలో మొదలైన అసలు సినిమా

థియేటర్లలో అసలైన సినిమా ఇపుడే మొదలైందా ? రెవిన్యు అధికారుల వ్యవహారం చూస్తుంటే అవుననే అనుకోవాలి. నిబంధనల ప్రకారం నడుచుకోని సినిమా థియేటర్లను సీజ్ చేయటానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో థియేటర్లలో రెవిన్యు అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు మొదలుపెట్టారు. గుంటూరు, చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని చాలా థియేటర్లను రెవిన్యు ఇన్సెపెక్టర్లు, పోలీసులు కలిసి తనిఖీలు చేశారు.

రోజుకు ఎన్నిషోలు వేస్తున్నారు ? టికెట్లను ఎంత ధరకు అమ్ముతున్నారు ? థియేటర్ల విద్యుత్ చార్జీలు చెల్లించారా లేదా ? బాత్ రూములు నిర్వహణ ఎలా ఉంది ? క్యాంటిన్లో అమ్ముతున్న వస్తువులేంటి ? అవి ప్రమాణాలకు తగ్గట్లుగానే ఉన్నాయా లేవా ? నిర్దేశిత ధరలకు మాత్రమే అమ్ముతున్నారా ? బిల్లులు ఇస్తున్నారా ?  వెహికల్ పార్కింగ్ లో టోకెన్లు ఇస్తున్నారా ? లేదా ? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా ? లేదా ? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

నిజానికి పై నిబంధనలన్నింటినీ ఇపుడు ప్రభుత్వం కొత్తగా పెట్టిందేమీ కాదు. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నవే. కాకపోతే గత ప్రభుత్వాలు ఏ నిబంధనలనూ పెద్దగా పట్టించుకోలేదు. థియేటర్ల యాజమాన్యాలు ఇష్టరాజ్యంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ఏ అధికారి కూడా కన్నెత్తి చూసిందిలేదు. దాంతో రోజుకు ఇన్నే షోలు వేయాలన్న నిబంధనను యాజమాన్యాలు తమిష్టం వచ్చినట్లు ఉల్లంఘించాయి. తమను అడిగేవారే లేరన్నట్లుగా వ్యవహరించాయి.

ఇపుడు ప్రభుత్వం సినీమాటోగ్రఫీ చట్టం నిబంధనలను గుర్తుచేస్తు థియేటర్ల తనిఖీలు మొదలుపెట్టింది. తమ తనిఖీలను వీడియోలు కూడా తీయించి జాయిట్ కలెక్టర్లకు పంపుతున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోని థియేటర్ల వివరాలు, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయన్న నివేదికలను రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు, పోలీసుల తనిఖీ బృందం ఆర్డీవోల ద్వారా జాయింట్ కలెక్టర్లకు అందిస్తున్నారు. ఇలా జిల్లా మొత్తం నుండి వచ్చిన నివేదికలపై జాయింట్ కలెక్టర్లు తమ రిపోర్టు రాసి ప్రభుత్వానికి పంపుతున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.