అర్జున్ మేన‌ల్లుడి విషాదాంతం.. లాస్ట్ ఫొటో, వీడియో వైర‌ల్‌

Chiranjeevi Sarja

క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. యువ న‌టుడు, అర్జున్ మేన‌ల్లుడు అయిన చిరంజీవి స‌ర్జా హ‌ఠాత్తుగా చ‌నిపోయాడు. గుండెపోటుతో అత‌ను ఆదివారం ఉద‌యం ప్రాణాలు విడిచాడు.

నిన్న‌టి వ‌ర‌కు హుషారుగా క‌నిపించిన చిరంజీవి ఇలా చ‌నిపోవ‌డం అంద‌రినీ విషాదంలో ముంచెత్తింది. అత‌ను చివ‌ర‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో, టిక్ టాక్‌లో పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి చిరంజీవి సన్నిహితులు, అభిమానుల గుండెె బరువెక్కుతోంది. చిరంజీవి చనిపోవడానికి ముందు రోజు రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పెషల్ ఫొటో షేర్ చేశాడు.

తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి చిన్నతనంలో దిగిన ఫొటోను అనుకరిస్తూ మళ్లీ అతను వాళ్లతో కలిసి ఫొటో దిగాడు. అప్పుడు ఇప్పుడు తాము ముగ్గురం ఒకేలా ఉన్నాం కదూ అని కామెంట్ జోడించాడు. అడోరబుల్ పిక్ అంటూ దీనికి ఫాలోవర్లు కామెంట్లు జోడించారు. ఇంకో 20 ఏళ్లకు కూడా మీలో మార్పు ఉండదు.. ఇలాగే కలిసి ఫొటో దిగాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రాత్రి ఈ ఫొటో షేర్ చేసిన చిరంజీవి ఉదయానికి ప్రాణాలు వదలడం అభిమానులకు పెద్ద షాకే. మరోవైపు ఇటీవల చిరంజీవి ఒక టిక్ టాక్ వీడియో చేశాడు.

ముందుగా అందులో నువ్వు ఇంత బాధలోనూ అంత సంతోషంగా ఎలా ఉంటావని రజనీ డైలాగ్ ప్లే అవతుంది. తర్వాత ‘‘నేను చక్రవర్తిని’’ అంటూ పాత తమిళ పాట ప్లే అవుతుంది. చివరగా విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’లోని ‘లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ నన్బా’’ అన్న పాట పల్లవితో ఈ వీడియో ముగుస్తుంది.

జీవితం చాలా చిన్నది అని ముందే సంకేతం ఇచ్చి చిరంజీవి ఇలా అర్ధంతరంగా జీవితాన్ని ముగించాడంటూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ‘బెండు అప్పారావు ఆర్ఎంపీ’లో రెండో హీరోయిన్‌గా నటించిన మేఘనా రాజ్.. చిరంజీవితో పదేళ్ల పాటు ప్రేమలో ఉండి రెండేళ్ల కిందటే అతణ్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడామె ప్రెగ్నెంట్ అంటుండటం విచారకరమైన విషయం.