‘మెగా’ బేనర్లో రాజశేఖర్?

Rajasekhar

సీనియర్ హీరో రాజశేఖర్ ఇప్పుడు క్రాస్ రోడ్స్‌లో ఉన్నారు. ‘కల్కి’ తర్వాత ఆయన కొత్త సినిమా సంగతి ఎటూ తేలకుండా ఉంది. ‘భాయ్’ దర్శకుడు వీరభద్రం చౌదరితో సినిమా అన్నారు కానీ.. దాని గురించి ఏ అప్ డేట్ లేదు. కొందరేమో త్వరలోనే సినిమా మొదలవుతుందని అంటున్నారు. కొందరేమో ఆల్రెడీ చిత్రీకరణ దశలో ఉందంటారు. కానీ ఏ విషయం స్పష్టత లేదు.

నిజానికి ఆయన ‘కల్కి’ తర్వాత కన్నడ హిట్ ‘కవులుదారి’ రీమేక్‌లో నటించాల్సింది. కానీ సినిమా అనౌన్స్ చేశాక దాన్నుంచి తప్పుకున్నారు. ఇప్పుడా చిత్రాన్ని సుమంత్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్తికావచ్చింది.

తర్వాత రాజశేఖర్ సినిమాపై ఏ సమాచారం లేదు. ఐతే ఆయన ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును ఓకే చేసినట్లు సమాచారం. ఆ చిత్రాన్ని అల్లు అరవింద్ ‘గీతా ఆర్ట్స్’ భాగస్వామ్యంలో రాజశేఖర్ భార్య జీవిత నిర్మిస్తారట.

‘పలాస 1978’ సినిమాతో సత్తా చాటుకున్న కొత్త దర్శకుడు కరుణ్ కుమార్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ‘పలాస’ను మెచ్చిన అరవింద్.. కరుణ్‌తో సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్టులోకి రాజశేఖర్ వచ్చాడు. తన వంతుగా పెట్టుబడి పెట్టడానికి కూడా రెడీ అయ్యాడు.

హార్డ్ హిట్టింగ్ కథాంశంతో తొలి సినిమాలో తన విలక్షణతను చాటిన కరుణ్.. ఈసారి రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోను పెట్టి ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి. చిరంజీవితో ఫ్యామిలీతో వివిధ సందర్భాల్లో విభేదాల దృష్ట్యా రాజశేఖర్ ఆయన బావ అరవింద్ బేనర్లో సినిమా చేయడం విశేషమే.

చివరగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు సంబంధించిన వివాదంలో రాజశేఖర్ తీరు పట్ల చిరు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అప్పట్నుంచి ‘మా’ కార్యకలాపాలతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యవహరాలకు రాజశేఖర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.