థ్రిల్లర్ కాన్సెప్ట్.. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం!

ఇంతకాలం గ్యాప్ తీసుకున్న నటుడు కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే ‘బింబిసార’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పుడు తొలిసారి ఆయన త్రిపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తోంది.

ఈ ఏడాది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ ఓ సినిమాను మొదలుపెట్టారు. కొత్త దర్శకుడు రాజేంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదొక థ్రిల్లర్ కాన్సెప్ట్ తో నడిచే స్టోరీ. కథ ప్రకారం.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారట. నిజానికి ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ అలాంటి ప్రయత్నం చేయలేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ.. మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు.

గత కొన్నేళ్లలో మాత్రం ఆయన ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో ఇప్పుడు త్రిపాత్రాభినయం చేయడానికి రెడీ అయిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.