డిసెంబర్ 12న ‘పుష్ప’ గ్రాండ్ ఈవెంట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. దానికి తగ్గట్లే.. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. అందులో భాగంగా భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. దీనికి యూసఫ్ గుడ్ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కానుంది.

నిజానికి ఈ ఈవెంట్ ను ముందుగా దుబాయ్ లో చేయాలనుకున్నారు. దానికి తగ్గట్లుగా కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దుబాయ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో హైదరాబాద్ లోనే గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించనున్నారు. మొదట ఈ వేడుకకు ప్రభాస్ గెస్ట్ గా వస్తారని వార్తలు వినిపించాయి. కానీ అందులో నిజం లేదని క్లారిటీ వచ్చింది.

ఇదిలా ఉండగా.. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ సినిమాను జోరుగా ప్రమోట్ చేయనుంది ‘పుష్ప’ టీమ్. ఇప్పటికే అల్లు అర్జున్ ముంబైలో ఓ పీఆర్ టీమ్ ను నియమించుకొని ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. తెలుగు ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఈ సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపే ట్రైలర్ విడుదల కాబోతుంది. మరో రెండు రోజుల్లో సినిమా షూటింగ్ కూడా పూర్తి కానుంది.

ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. సమంత ఐటెం సాంగ్ లో నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. అదే రేంజ్ లో సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది.