ఓటీటీలో రాజ’శేఖర్’ సినిమా.. నిజమెంత..?

కరోనా సమయంలో ఓటీటీలకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద సినిమాలు సైతం నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే థియేటర్లు తెరుచుకోవడంతో పేరున్న సినిమాలేవీ కూడా ఓటీటీలో రావడం లేదు. చిన్న సినిమాలను మాత్రమే ఓటీటీలకు అమ్ముకుంటున్నారు. పైగా ‘అఖండ’ సక్సెస్ చాలా మందికి బూస్టప్ ఇచ్చింది. కాబట్టి పరిస్థితులు బాగోకపోతే తప్ప ఇప్పట్లో ఏ సినిమా కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాదు. ఇలాంటి సమయంలో రాజశేఖర్ సినిమాను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. 

మలయాళం లో హిట్ అయిన ‘జోసెఫ్’ అనే సినిమాకి రీమేక్ గా ‘శేఖర్’ సినిమాను తెరకెక్కించారు. రాజశేఖర్ హీరోగా నటించిన ఈ సినిమాను ముందు ఓ కొత్త డైరెక్టర్ తో మొదలుపెట్టారు. కానీ ఈక్వేషన్స్ మారడంతో జీవితా రాజశేఖర్ డైరెక్టర్ గా ఈ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా కోసం కొన్ని ఓటీటీ సంస్థలు ఫ్యాన్సీ డీల్ ను ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం రూ.25 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. 

ఆల్రెడీ హిట్ అయిన కథ, పైగా ఇటీవల విడుదలైన సినిమా టీజర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో ఈ రేంజ్ లో ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇది మంచి డీల్ అనే చెప్పాలి. కానీ సినిమాకి వస్తోన్న బజ్ చూసిన దర్శకనిర్మాతలు థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తే బిజినెస్ పరంగా బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారట. సరైన డేట్ దొరికితే థియేటర్లలో సినిమాను విడుదల చేసి.. ఆ తరువాత ఓటీటీకి అమ్మాలని చూస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!