యంగ్ హీరో కుటుంబంలో విషాదం

టాలీవుడ్ ఇప్పటికే దిగ్గజ కవి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో విషాదంలో మునిగిపోయింది. గత రెండేళ్లలో ఎన్నో విషాదాలను చూసిన సినీ జనాలకు ఇదో పెద్ద దెబ్బ. అందరూ ఈ బాధలో ఉండగానే ఒక తెలుగు యువ కథానాయకుడి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది.

‘రాజా వారు రాణివారు’ సినిమాతో హీరోగా పరిచయమై.. తొలి చిత్రంతోనే ప్రతిభ చాటుకుని.. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాతో మరింతగా జనాదరణ సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. తన సోదరుడిని కోల్పోయాడు. అతడి అన్నయ్య అయిన అబ్బవరం రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బుధవారం మధ్యాహ్నం కడప జిల్లాలోనే అతను రోడ్డు ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

కిరణ్ హీరోగా నిలదొక్కుకోవడంలో అతడి సోదరుడి పాత్ర కీలకంగా చెబుతున్నారు. వ్యాపారంలో ఉన్న రామాంజులు రెడ్డి కిరణ్‌కు అన్ని రకాలుగా చేదోడువాదోడుగా ఉన్నట్లు సమాచారం. కిరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు ప్రొడక్షన్ పరంగా కూడా అతను తోడ్పాటు అందిస్తున్నాడట. మొన్ననే కిరణ్ కొత్త సినిమాను అనౌన్స్ చేసిన ఉత్సాహంలో ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ భాగస్వామ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాకు ఏమంత మంచి టాక్ రాకపోయినా.. దానికి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. యూత్‌లో కిరణ్ మంచి ఫాలోయింగే సంపాదించుకున్నాడు. దీంతో అతడికి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఆల్రెడీ చాందని చౌదరితో కలిసి ‘సమ్మతమే’ అనే సినిమా చేస్తున్న కిరణ్.. ‘సెబాస్టియన్’ పేరుతో ఇంకో సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు కొత్త సినిమా మొదలుపెట్టిన ఉత్సాహంలో ఉండగా సోదరుడిని కోల్పోవడం బాధాకరం.