చరణ్-శంకర్.. ఒక మెగా సాంగ్

ఇండియన్ సినిమాలో పాటల కోసం భారీగా ఖర్చు చేసే ట్రెండ్ మొదలుపెట్టిందే శంకర్ అని చెప్పాలి. ఇప్పుడు ఒక్కో పాట మీద కోటి రూపాయల ఖర్చు పెట్టడం మామూలు విషయం అయిపోయింది కానీ.. శంకర్ పది పదిహేనేళ్ల కిందటే పాటల కోసం కోట్లు పెట్టించేసేవాడు. శివాజీ సినిమాలో ఒక్కో పాటకు అయిన ఖర్చు, ఆ సెట్టింగ్స్, ఆ విజువల్స్ చూసి అప్పట్లో అందరికీ కళ్లు చెదిరిపోయాయి.

శంకర్ మిగతా సినిమాల్లో పాటు ఎంత రిచ్‌గా ఉంటాయో తెలిసిందే. ఆయన సినిమాల్లో ఒక్కో పాటకు పెట్టే ఖర్చుతో చిన్న స్థాయిలో ఒక సినిమా తీసేయొచ్చంటే అతిశయోక్తి కాదు. ఏ స్థితిలోనూ ఆయన ఈ విషయంలో రాజీ పడరు. రామ్ చరణ్ హీరోగా తీస్తున్న కొత్త సినిమా విషయంలోనూ ఆయన ఇదే ఒరవడిని కొనసాగిస్తున్నట్లు సమాచారం. సినిమాలో ఒక అదిరిపోయే డ్యాన్స్ నంబర్ కోసం శంకర్ కోట్లు ఖర్చు చేయిస్తున్నాడట.

రామోజీ ఫిలిం సిటీలో ఈ పాట కోసం జరుగుతున్న సన్నాహాలు చర్చనీయాంశంగా మారాయి. కళ్లు చెదిరే సెట్టింగ్స్ వేసి రెండు మూడు వారాల పాట ఈ పాటను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం. ఈ పాటలో ఏకంగా 80 మంది ఫారిన్ డ్యాన్సర్లు కనిపిస్తారట. విదేశాలకు వెళ్లినపుడు అక్కడి లోకల్ డ్యాన్సర్లను బ్యాగ్రౌండ్లో ఉపయోగించుకోవడం మామూలే. కానీ విదేశాల నుంచి 80 మంది డ్యాన్సర్లను రప్పించి ఇక్కడ భారీ స్థాయిలో పాట చిత్రీకరించడం మాత్రం నభూతో అని చెప్పొచ్చు.

ఈ పాట సినిమాకు హైలైట్ అయ్యేలా భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారని.. చరణ్ దీని కోసం చాలా రోజుల పాటు రిహార్సల్స్ కూడా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ స్టూడియోస్ వాళ్లకు రూ.350 కోట్లకు అమ్మినట్లుగా ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.