టెన్షన్ టెన్షన్.. చివరికి సినిమా బయటికొచ్చింది

మానాడు.. తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన శింబు హీరోగా నటించిన చిత్రమిది. విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరైన వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని రూపొందించాడు. శింబు సినిమాలంటే ప్రతిసారీ ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. గతంలో అతడి చిత్రాలు చాలా వాటికి విడుదల విషయంలో సమస్యలు తలెత్తాయి. ‘మానాడు’ కూడా అందుకు మినహాయింపు కాదు. విడుదలకు ముందు రోజు ఫైనాన్స్ సమస్యలు తలెత్తి రిలీజ్‌పై అయోమయం నెలకొంది. ‘మానాడు’ వాయిదా పడబోతున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఐతే చిత్ర దర్శకుడు, నిర్మాత, హీరో కలిసి వెంటనే రంగంలోకి దిగారు. చర్చలు జరిపారు. సమస్యను పరిష్కరించి సినిమా యధావిధిగా గురువారం రిలీజవుతుందని ప్రకటించారు. తమిళంలో ఏ స్టార్ హీరో సినిమాకైనా తెల్లవారుజామున ఫ్యాన్స్ షోలు పడాల్సిందే. ‘మానాడు’కు కూడా తెల్లవారుజామున 5 గంటలకే షోలు ప్లాన్ చేశారు.

కానీ టికెట్లు బుక్ చేసుకుని ఎంతో ఉత్సాహంగా థియేటర్లకు వచ్చిన శింబు అభిమానులకు నిరాశ తప్పలేదు. ఎక్కడా ఫ్యాన్స్ షోలు పడలేదు. దీంతో కొన్ని చోట్ల గొడవలు, అల్లర్లు జరిగాయి. చివరికి సమస్య పరిష్కారమై ఉదయం 8 గంటల నుంచి తమిళనాట షోలు మొదలయ్యాయి. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. ఈ ఆందోళనంతా అయ్యాక సినిమాకు అసలెలాంటి టాక్ వస్తుందో అన్న టెన్షన్ మొదలైంది అభిమానుల్లో.

ఐతే వెంకట్ ప్రభు శింబు అభిమానుల నమ్మకాన్ని దెబ్బ తీయలేదు. చాలా కాంప్లికేట్ అయిన టైమ్ లూప్ కాన్సెప్ట్‌ను ఎంటర్టైనింగ్‌గా డీల్ చేసి మంచి సినిమానే అందించాడన్నది అక్కడొస్తున్న టాక్. అన్ని వైపులా టాక్ బాగుంది. రివ్యూలు కూడా ఫుల్ పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో శింబు అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం ‘ది లూప్’ పేరుతో శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.