సందీప్-ప్రభాస్.. 2025లో?

‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్లో సంచలనం రేపి.. ఆ తర్వాత దాని రీమేక్ ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేశాడు సందీప్ రెడ్డి వంగ. రెండే రెండు సినిమాలతో అతను తెచ్చుకున్న క్రేజ్ అలాంటిలాంటిది కాదు. ఐతే ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ తీసే తర్వాతి తెలుగు సినిమా కోసం ఇక్కడి ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రీమేక్ సినిమా కదా ‘కబీర్ సింగ్’ చకచకా లాగించేసి త్వరగా తిరిగొచ్చేస్తాడనుకుంటే.. ఆ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి దాదాపు రెండేళ్లు సమయం తీసుకున్నాడు.

ఆ తర్వాత బాలీవుడ్లోనే తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. రణబీర్ కపూర్ లాంటి పెద్ద హీరో.. టీ సిరీస్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి సందీప్ తర్వాతి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘యానిమల్’ పేరుతో రానున్న ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులైంది. షూటింగ్ మొదలుపెట్టడంలో చాలా ఆలస్యం జరిగింది.

ఎట్టకేలకు సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తున్నారు కానీ.. ముందు ప్రకటించిన రిలీజ్ డేట్‌కు ‘యానిమల్’ను విడుదల చేయట్లేదు. 2022 దసరాకు అనుకున్న సినిమా కాస్తా ఇంకో పది నెలలు ఆలస్యంగా రాబోతోంది. 2023 ఆగస్టు 11కు ‘యానిమల్’ను ఫిక్స్ చేస్తూ తాజాగా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అంటే సందీప్ ఇంకో రెండేళ్ల తర్వాత కానీ తన తర్వాతి సినిమాను మొదలుపెట్టే అవకాశం లేదు. అతను తన తర్వాతి చిత్రాన్ని ప్రభాస్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ ఈలోపు తన చేతిలో ఉన్న అన్ని సినిమాలనూ పూర్తి చేయడమే కాక.. ఇంకో సినిమా ఏదైనా చేసినా ఆశ్చర్యం లేదేమో. ప్రభాస్‌తో సందీప్ చేయబోయేది పాన్ ఇండియా మూవీ కాబట్టి దాని మేకింగ్, రిలీజ్‌కు కూడా బాగానే టైం పడుతుంది. కాబట్టి వీరి కలయికలో సినిమాను 2025లో కానీ థియేటర్లలో చూసే అవకాశం లేదు. అంటే 2017లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సందీప్.. 2025లో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తాడన్నమాట.