ఎన్టీఆర్ కోసం ఆమె రంగంలోకి దిగింది

జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న ప్రమేయం లేకుండా ఇప్పుడో వివాదంలో చిక్కుకున్నారు. ట్విట్ట‌ర్ చిట్ చాట్ సంద‌ర్భంగా తార‌క్ గురించి చెప్ప‌మ‌ని హీరోయిన్ మీరా చోప్రాను అత‌డి అభిమానులు అడిగితే అత‌నెవ‌రో తెలియ‌ద‌ని ఆమె అన్నందుకు బూతులు తిట్టేశారు. దీనిపై ఆమె చాలా సీరియ‌స్ అయింది. ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేసి మ‌రీ అత‌డి అత‌డి అభిమానుల బూతుల తాలూకు స్క్రీన్ షాట్లు పెట్టింది.

దీనిపై పోలీసులతో పాటు ఏపీ సీఎం, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ల‌కూ ఫిర్యాదు చేసింది. అభిమానుల చ‌ర్యపై ఆమె తార‌క్‌ను నిల‌దీసిన సంగ‌తీ తెలిసిందే. ఐతే ఈ విష‌యంలో తార‌క్‌ను బాధ్యుడిని చేయ‌డం, అత‌ను వివర‌ణ ఇవ్వాల‌న‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

ఐతే దీనిపై తార‌క్ స్పందించ‌నూ లేడు. అలాగ‌ని సైలెంటుగా ఉన్నా స‌మ‌స్యే. ఈ ఇష్యూలో ఇండస్ట్రీ నుంచి నేరుగా తార‌క్ త‌ర‌ఫున ఎవ‌రైనా మాట్లాడ‌ట‌మూ క‌ష్ట‌మే. ఐతే ఎవరూ ఊహించని విధంగా తార‌క్‌తో ఇంత‌కుముందు ‘ఊస‌ర‌వెల్లి’ సినిమాలో చిన్న పాత్ర చేసిన పాయ‌ల్ ఘోష్ రంగంలోకి దిగింది. ఆమె ఉన్న‌ట్లుండి అభిమానుల‌తో చిట్ చాట్ చేసింది.

అందులో తార‌క్ అభిమానులు అత‌డి గురించి అడిగారు. ఆమె బ‌దులిస్తూ తార‌క్ మ‌హిళ‌ల్ని ఎంత‌గా గౌర‌విస్తాడో చెప్పుకొచ్చింది. ఊస‌ర‌వెల్లి షూటింగ్ టైంలో తాను రోడ్డు ప‌క్క‌న టెంటులో బ‌ట్ట‌లు మార్చుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తే అత‌నెంత‌గా పీలైంది వివ‌రించింది. తార‌క్‌కు మ‌హిళ‌లంటే గౌర‌వం, మ‌హిళ‌లంటే గౌర‌వం అంటూ ఆమె నొక్కి వ‌క్కాణిస్తూ వివ‌రంగా ట్వీట్లు వేసింది. అత‌డి వ్య‌క్తిత్వాన్ని పొగిడింది. అలాగే ఉత్త‌రాదిన అత‌డి ఫాలోయింగ్ గురించి కూడా చెప్పుకొచ్చింది.

ఫ్యాన్స్ ఎన్టీఆర్ గురించి అడగని విషయాలకు కూడా ఆమె సమాధానం చెప్పి ఆశ్చర్యం కలిగించింది. మొత్తానికి మీరా ఎపిసోడ్‌లో దెబ్బ తిన్న తారక్ అభిమానులకు పాయల్ ఇలా మాట్లాడటం ఊరటనిచ్చే విషయమే. అందుకే ఆమె ట్వీట్లను పెద్ద ఎత్తున రీట్వీట్ చేస్తున్నారు.