లావణ్యకు త్రివిక్రమ్ బిగ్ బ్రేక్?


‘అందాల రాక్షసి’లో లావణ్య త్రిపాఠిని చూసి ఎంతోమంది కుర్రాళ్ల హృదయాలు లయ తప్పాయి. ఆమె వాళ్లందరికీ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా లావణ్య మాత్రం అందరికీ నచ్చేసింది. రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్లు భిన్నమైన టిపికల్ అందం, అభినయంతో ఆమె ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత లావణ్యకు అవకాశాలైతే బాగానే వచ్చాయి కానీ.. ఇన్నేళ్లలో ఆమె ఎప్పుడూ ఒక స్థాయిని మించి మాత్రం ఎదగలేకపోయింది.

ఎప్పుడూ మిడ్ రేంజ్ హీరోలకు జోడీగానే నటించింది తప్ప.. బడా స్టార్లతో జోడీ కట్టలేదు. పెద్ద దర్శకులు కూడా ఆమెకు అంతగా అవకాశాలు ఇవ్వలేదు. ఇంతకుముందు మీడియం రేంజ్‌లో అయినా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయేది కానీ.. ఈ మధ్య ఆ ఛాన్సులు కూడా తగ్గిపోయాయి.

ఈ ఏడాది ఎ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాల్లో కనిపించిన లావణ్యకు ఆ రెండూ నిరాశనే మిగిల్చాయి. దీంతో లావణ్య కెరీర్ ఇక క్లోజ్ అయిపోయినట్లే అన్న నిర్ణయానికి వచ్చేశారందరూ. కానీ ఆమెకు ఇప్పుడో భారీ చిత్రంలో అవకాశం దక్కినట్లుగా వార్తలొస్తున్నాయి. అది మహేష్ బాబు-త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా కావడం విశేషం.

ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ కథానాయికగా ఖరారైన సంగతి తెలిసిందే. రెండో హీరోయిన్‌గా లావణ్యకు ఛాన్స్ ఇచ్చాడట త్రివిక్రమ్. ఇంతకుముందులా మీడియం రేంజ్ సినిమాల్లోనే అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న లావణ్యకు ఇంత పెద్ద సినిమాలో ఛాన్స్ అంటే ఆమె ఆనందానికి అవధులుండవు. రెండో హీరోయిన్‌గా అయినా సరే.. ఆమెకిది కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. మరి ఈ వార్త నిజమో కాదో చూడాలి.