రవితేజ.. బెల్లంకొండ.. నువ్వానేనా


ఒకే కథతో ఒకే సమయంలో రెండు సినిమాలు తెరకెక్కడం అరుదు. ఇప్పుడు టాలీవుడ్లో అదే జరగబోతోంది. ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతంలో దోపిడీలతో హడలెత్తించిన గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఇంతకుముందే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘స్టువర్టుపురం దొంగ’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కేఎస్ అనే దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు.

ఇప్పుడు ఇదే కథతో ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిలే పెట్టి రవితేజ ప్రధాన పాత్రలో సినిమాను ప్రకటించారు. దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రాల దర్శకుడు వంశీ ఆకెళ్ల దీనికి డైరెక్టర్. అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించనుంది. ఐతే ఒకే కథతో ఒకే సమయంలో రెండు సినిమాలు వస్తే ప్రేక్షకులు దేనికి పట్టం కడతారు.. రెండింట్లో ఏది పైచేయి సాధిస్తుంది అన్నది ఆసక్తికరం.

ప్రస్తుతానికైతే రవితేజ చేస్తున్న సినిమా ఏ రకంగా చూసినా మెరుగైన స్థితిలో ఉంది. దీని కాస్ట్ అండ్ క్రూ రేంజ్ వేరు. అలాగని ఈ ఆకర్షణలు మాత్రమే సినిమాకు విజయం చేకూర్చలేవు. పకడ్బందీగా ఎవరు సినిమా తీస్తారన్నది ముఖ్యం. ఐతే ఈ రెండు చిత్రాల్లో మొదట రిలీజయ్యేదానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ముందు వచ్చిన సినిమాకు మంచి టాక్ వస్తే జనాలు బాగా చూస్తారు. ఆ తర్వాత రిలీజయ్యే సినిమా పట్ల ఆసక్తి తగ్గిపోతుంది.

గత ఏడాది హిందీలో హర్షద్ మెహతా జీవిత కథ ఆధారంగా ‘స్కామ్ 1992’ అనే వెబ్ సిరీస్ వచ్చి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. అదే సమయంలో అభిషేక్ బచ్చన్ హీరోగా హర్షద్ కథతో ‘బిగ్ బుల్’ అనే సినిమా తీశారు. ‘స్కామ్ 1992’ ముందే రిలీజై అద్భుత ఫలితాన్నందుకోవడంతో ‘బిగ్ బుల్’ మీద ఆసక్తి తగ్గిపోయింది. హాట్ స్టార్‌లో రిలీజైతే ఈ సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి తమ సినిమానే ముందు రిలీజ్ చేయాలని రెండు చిత్రాల బృందాలు పోటీ పడి వేగంగా సినిమాను పూర్తి చేసి విడుదల చేయడానికి ప్రయత్నించే అవకాశముంది.