ఆ డిజాస్టర్ దెబ్బ.. ఇన్నేళ్లకు కోలుకున్నాడు

రారా కృష్ణయ్యా అని సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన సినిమా. రెజీనా కసాండ్రా కథానాయికగా చేసింది. సందీప్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత మంచి ఊపులో ఉన్న టైంలో ఈ సినిమా చేశాడు. సినిమాకు బాగానే హైప్ వచ్చింది. దీని ప్రోమోలు చూసి సినిమా సూపర్ హిట్టవుతుందని అంచనా వేశారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. సినిమా అనుకున్నంతగా లేక డిజాస్టర్ అయింది. ‘రారా కృష్ణయ్య’ తీసిన దర్శకుడి పేరు మహేష్ బాబు.పి.

పాతికేళ్ల లోపు వయసులోనే ఈ సినిమా తీసి..దానికి మంచి హైప్ తీసుకొచ్చిన ఈ దర్శకుడికి బాక్సాఫీస్ దగ్గర మాత్రం నిరాశ తప్పలేదు. ఆ దెబ్బ నుంచి అతను కోలుకోవడానికి చాలా టైం పట్టింది. తొలి సినిమా తీశాక ఏడేళ్ల పాటు ఖాళీగా ఉండిపోయాడు. ఎట్టకేలకు అతడికి రెండో సినిమా ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రాన్ని ఈ ఆదివారమే ప్రకటించారు.

అనుష్క ప్రధాన పాత్రలో యువి క్రియేషన్స్ నిర్మాణంలో మహేష్ బాబు తన రెండో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. మొత్తానికి చాలా గ్యాప్ వచ్చినప్పటికీ ఈ యువ దర్శకుడు క్రేజీ కాంబినేషన్లోనే సినిమాను సెట్ చేసుకున్నాడు. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరైన అనుష్కతో లేడీ ఓరియెంటెడ్ సినిమా.. అందులోనూ యువి క్రియేషన్స్ లాంటి టాప్ బేనర్లో సినిమా అంటే చిన్న అవకాశమేమీ కాదు. మరి తొలి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయిన మహేష్ బాబు.. ఈ సినిమాతో అయినా మంచి హిట్ కొట్టి దర్శకుడిగా సక్సెస్ అవుతాడేమో చూడాలి.

యువి బేనర్లో అనుష్క చేసిన మిర్చి, భాగమతి ఘనవిజయాలందుకున్న సంగతి తెలిసిందే. ‘భాగమతి’ తర్వాత అనుష్క చేసిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘నిశ్శబ్దం’ నిరాశ పరిచింది. దీంతో ఆమె చాలా గ్యాప్ తీసుకుని కొత్త సినిమాకు ఓకే చెప్పింది. ఇదొక న్యూ ఏజ్ థ్రిల్లర్ అని అంటున్నారు. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.