స్కైల్యాబ్.. స్పెషల్‌ కథలా ఉందే!

నిత్యామీనన్ ఏదైనా సినిమా యాక్సెప్ట్ చేసిందంటే అందులో కచ్చితంగా ఏదో ఒక మంచి పాయింటే ఉంటుందని నమ్ముతారు ఆడియెన్స్‌. ఆమెకి సత్యదేవ్ లాంటి మంచి ఆర్టిస్ట్ తోడయ్యాడు. వాళ్లిద్దరితో రాహుల్ రామకృష్ణ లాంటి గుడ్ పర్‌‌ఫార్మర్‌‌ కలిశాడు. ఇంకేముంది.. స్కైల్యాబ్ ట్రైలర్ అదిరింది.

1979లో అమెరికా ఏర్పాటు చేసిన స్కైల్యాబ్ భూమ్మీద పడబోతోందనే వార్తలు ప్రజల్ని చాలా కంగారుపెట్టాయి. ఏ శకలం వచ్చి పడుతుందో, తమని ఎక్కడ తుడిచి పెట్టేస్తుందో అని ప్రపంచ దేశాలన్నీ కంగారుపడ్డాయి. అలాంటి సమయంలో కరీంనగర్ జిల్లాలోని బండ లింగంపల్లి అనే ఊళ్లో ప్రజలు ఎలా ఫీలయ్యారు, వారి జీవితాలు ఎలా మారాయి అనే కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు విశ్వక్ కందెరావ్. డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు కన్‌ఫర్మ్ చేస్తూ ట్రైలర్‌‌ను వదిలారు. పూర్తి భిన్నమైన కథతో, విభిన్నమైన క్యారెక్టర్స్‌తో రూపొందుతున్న ఈ కామెడీ డ్రామా ఎలా ఉంటుందో రుచి చూపించారు.

సత్యదేవ్‌కి డబ్బు పిచ్చి. బండ లింగంపల్లిలో క్లినిక్ స్టార్ట్ చేసి ఎక్కడికో ఎదిగిపోవాలనుకుంటారు. రిపోర్టర్‌‌గా సంచలనాలు సృష్టించాలనుకునే దొరబిడ్డ గౌరిగా నిత్యామీనన్ కనిపిస్తోంది. ఏదో ఒక అద్భుతమైన న్యూస్ దొరికితే జీవితమే మారిపోతుందని ఎదురు చూస్తుంటుంది. సుబేదార్ రామారావు పాత్రను రాహుల్ రామకృష్ణ పోషించాడు. స్కైల్యాబ్ పడుతోందనే వార్తతో వీరి జీవితాలు ఎలా మారాయి అనేది చాలా ఎంటర్‌‌టైనింగ్‌గా చూపించారని ట్రైలర్‌‌లోని కామెడీ చూస్తే అర్థమవుతోంది. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే నిత్య, సత్యదేవ్‌ల బ్యాగ్‌లో మంచి హిట్ పడినట్టే.