బాలయ్య షో లో బీభత్సమే

నందమూరి బాలకృష్ణ ఏదైనా వేడుకల్లో, ఇంకేదైనా వేదికల్లో మాట్లాడుతుంటే ఎంత తడబడతాడో అందరికీ తెలుసు. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్లిపోతుంటాడు. కొన్నిసార్లు ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కూడా కానంత గందరగోళం కనిపిస్తుంటుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక టాక్ షోను నడిపించబోతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అదే సమయంలో ఆసక్తికి కూడా కొదవ లేదు. ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ పేరుతో బాలయ్య టాక్ షో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. దీపావళికి దీని ప్రిమియర్స్ పడబోతున్నాయి. తొలి ఎపిసోడ్లో మంచు మోహన్ బాబుతో పాటు ఆయన పిల్లలు మంచు విష్ణు, మంచు లక్ష్మి అతిథులుగా పాల్గొనబోతున్న విషయం ఇంతకుముందే రివీలైంది.

ఇప్పుడు వీరు పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అది చూస్తే ఈ షో సంచలనాత్మకంగా ఉండబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మోహన్ బాబుతో వ్యవహారం మామూలుగానే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆయనేదైనా టాక్ షో, లేదా ఇంటర్వ్యూకు వస్తే ఎక్కడో ఒక చోట వాడి వేడి వ్యాఖ్యలతో అగ్గి రాజేస్తుంటారు.

అందులోనూ ఇప్పుడు మంచి టెంపర్‌మెంట్ ఉన్న బాలయ్య హోస్ట్ చేస్తున్న షోకు మోహన్ బాబు రావడంతో అంచనాలకు తగ్గట్లే హీట్ పెరిగిపోయింది. ఒకచోట బాలయ్య.. చిరంజీవి గురించి అభిప్రాయం అడిగితే మోహన్ బాబు ఏదో వివాదాస్పద వ్యాఖ్య చేసినట్లుగా ఉంది ప్రోమో చూస్తుంటే.

మరోవైపు ఎన్టీఆర్ చనిపోయాక ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు నువ్వు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకిచ్చావు అనే సంచలన ప్రశ్నను మోహన్ బాబు బాలయ్యకు వేయడం అమితాసక్తిని రేకెత్తించేదే. ఐతే మొత్తం షో అంతా ఇలా హాట్ హాట్‌గానే ఏమీ సాగలేదు. వినోదానికి కూడా ఢోకా లేకుండా చూసుకున్నారు.

బాలయ్య-మోహన్ బాబు మధ్య వయసు గురించి చర్చ జరగడం.. మోహన్ బాబు సతీమణిని బాలయ్య పిన్ని అనడం.. ఇలా కొన్ని ఫన్నీ మూమెంట్స్ కనిపించాయి. మరోవైపు విష్ణు, లక్ష్మి ఎంటరయ్యాక ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా తయారైనట్లుంది. మొత్తానికి ‘అన్ స్టాపబుల్’ ప్రోమోతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో మాత్రం ‘ఆహా’ టీం బాగానే సక్సెస్ అయిందని చెప్పాలి.