చిరంజీవితో నటించాలని.. ఆ కోరిక తీరకుండానే..

పునీత్ రాజ్‌కుమార్ మరణవార్తని ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. బేసిగ్గా కన్నడ స్టార్ హీరోనే అయినా.. అన్ని భాషల వారికీ ఆయనంటే ఇష్టం. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల ద్వారా మన తెలుగువారికి ఆయన బాగా పరిచయం. పైగా పునీత్ స్టార్ అయ్యింది మన తెలుగు సినిమాల రీమేక్స్‌తోనే. ఇడియట్, ఆంధ్రావాలా, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఒక్కడు వంటి చిత్రాల కన్నడ రీమేక్స్‌తో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు పునీత్.

ఆంధ్రావాలా రీమేక్‌ కారణంగా పునీత్‌కి ఎన్టీఆర్‌‌తో మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన నటించిన ‘చక్రవ్యూహ’లో ఓ పాట కూడా పాడాడు ఎన్టీఆర్. మహేష్‌ బాబు, బాలకృష్ణ, పూరి జగన్నాథ్, మెహర్ రమేష్‌ లాంటి వారందరితోనూ కూడా మంచి స్నేహం ఉంది. అయితే చిరంజీవి అంటే పునీత్‌కి చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే.. ఆయనతో కలిసి నటించాలని కోరుకునేంత.

చిరంజీవి ‘భోళాశంకర్’ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో సెట్స్‌కి వెళ్లనున్న ఈ మూవీకి మెహర్ రమేష్‌ దర్శకుడు. మెహర్‌‌తో మంచి రిలేషన్‌ ఉండటంతో తన మనసులోని మాటని అతని దగ్గర చెప్పాడట పునీత్. ‘బోళాశంకర్‌‌’లో ఓ చిన్న సీన్‌లో అయినా చిరంజీవితో కలిసి నటించాలని ఉందని మెహర్‌‌ని పునీత్‌ అడిగినట్లు తెలుస్తోంది.

అది నిజమై ఉంటే, అదే కనుక జరిగివుంటే మెగాస్టార్‌‌ని, కన్నడ సూపర్‌‌స్టార్‌‌ని ఒకే ఫ్రేమ్‌లో చూసే అవకాశం ప్రేక్షకులకి దక్కి ఉండేది. కానీ చాన్స్ ఇక లేదు. తన కోరిక తీరకుండానే పునీత్ వెళ్లిపోయారు. అంత మంచి వ్యక్తి మరణం తనను కలచివేస్తోందంటూ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.