సుమంత్.. భలే టైమింగ్‌తో దిగుతున్నాడు

హీరోగా నిలదొక్కుకోవడానికి రెండు దశాబ్దాలుగా పోరాడుతున్న నటుడు సుమంత్. ఘన వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుమంత్‌కు ఎప్పుడో ఒకసారి ఓ మంచి విజయం దక్కుతోంది. కానీ తర్వాత వరుస ఫ్లాపులు అతడిని నీరు గార్చేస్తున్నాయి. సత్యం, గోదావరి, మళ్ళీ రావా లాంటి మంచి సినిమాలకు అటు ఇటు అతను దారుణమైన ఫలితాలను అందుకున్నాడు.

‘మళ్ళీ రావా’తో బాగానే పుంజుకున్నాడనుకుంటే.. ఆ తర్వాత పేలవమైన సినిమాలొచ్చాయి అతడి నుంచి. చివరగా ‘కపటధారి’ అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని ‘మళ్ళీ మొదలైంది’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాగార్జున మేనల్లుడు. ఇది ‘మళ్ళీ రావా’కు ఇంకో వెర్షన్ లాగా ఉంది. ఆ చిత్రం వివిధ వయసుల్లో ప్రేమ భావనల మీద నడిస్తే.. కొత్త చిత్రం పెళ్లి తర్వాత వచ్చే అభిప్రాయ భేదాల మీద సాగే సినిమా.

ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో సరిపడక విడిపోయిన వ్యక్తి.. ఇంకో అమ్మాయి వైపు ఆకర్షితుడు కావడం.. తనతో కొత్త బంధం మొదలుపెట్టడం.. తర్వాత మళ్లీ వీరి మధ్య కూడా విభేదాలు రావడం.. ఈ నేపథ్యంలో నడిచే కథ ‘మళ్ళీ మొదలైంది’.

తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గానే సాగింది. ముఖ్యంగా తన భార్య నుంచి తనకు విడాకులు ఇప్పించిన లాయర్‌ను చూసి ప్రేమలో పడి ఆమెతో కొత్త బంధాన్ని మొదలుపెట్టడానికి హీరో ప్రయత్నించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంటర్టైనింగ్‌గా అనిపించే పాయింట్. ఈ కొత్తమ్మాయిని పెళ్లి చేసుకున్నాక తనతోనూ విభేదాలు వచ్చి అంతకుముందు విడాకులు మంజూరు చేసిన జడ్జి ముందుకే వెళ్లి నిలబడటం కొసమెరుపు.

సుమంత్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా మెరుగ్గా ఉండేలా కనిపిస్తోంది. కీర్తి కుమార్ అనే కొత్త డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అక్కినేని ఫ్యామిలీలో సుమంత్ సహా చాలామంది విడాకులు తీసుకున్న వారే. అందులోనూ ఈ మధ్యే నాగచైతన్య, సమంత విడిపోయిన నేపథ్యంలో అక్కినేని కుటుంబ డైవర్స్ స్టోరీలపై చర్చ నడుస్తోంది. ఇలాంటి టైంలో విడాకుల నేపథ్యంలో సాగే సినిమాతో ప్రేక్షకులను పలకరించడం అంటే సుమంత్‌ మంచి టైమింగ్‌లో వస్తున్నట్లే.