కృష్ణవంశీ కోసం చిరు మళ్లీ..

90వ దశకంలో తెలుగులో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడు కృష్ణవంశీ. గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం లాంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడాయన. ఆ టైంలో కృష్ణవంశీతో పని చేయడానికి బడా బడా స్టార్లందరూ ఆసక్తి చూపించారు. అందులో అప్పటి నంబర్ వన్ హీరో, మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. వీరి కలయికలో ‘వందేమాతరం’ అనే సినిమా రావాల్సింది.


ఐతే ఏవో కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. కేవలం తన అహంకారం వల్లే చిరుతో సినిమా చేయలేకపోయానంటూ కొన్నేళ్ల కిందట చిరు తనయుడు ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తెరకెక్కుతున్న సమయంలో కృష్ణవంశీ వెల్లడించడం గమనార్హం. తనకు అస్సలు కాలం కలిసి రాక, వరుస పరాజయాలు ఎదురవుతున్న సమయంలో చరణ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం పట్ల కృష్ణవంశీ చాలా ఎమోషనల్ అయ్యాడు. అదంతా చిరంజీవి మంచితనం వల్లే జరిగిందంటూ పాత విషయాలు గుర్తు చేసుకున్నాడు.

ఐతే చిరు నమ్మకాన్ని నిలబెట్టే స్థాయిలో ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రాన్ని విజయవంతం చేయలేకపోయాడు కృష్ణవంశీ. అయినా సరే.. కృష్ణవంశీ పట్ల తన ఆపేక్షను చిరు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కృష్ణవంశీ కెరీర్ మరింత సంక్షోభంలో ఉంది. ఇప్పుడాయనకు సక్సెస్ చాలా చాలా అవసరం. ఆయన ఆశలన్నీ ‘రంగ మార్తాండ’ మీదే ఉన్నాయి. ఈ చిత్రం మొదలై రెండేళ్లు కావస్తున్నా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. కరోనా సహా వేరే కారణాల వల్ల ఆలస్యమవుతోంది. ఈ సినిమాకు అనుకున్నంత బజ్ కూడా లేదు మార్కెట్లో.

ఇందులో యంగ్ స్టార్లెవరూ లేకపోవడం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి సీనియర్లు నటిస్తుండటం, కృష్ణవంశీ ట్రాక్ రికార్డు అందుకు కారణం కావచ్చు. సినిమాకు బజ్ పెంచాల్సిన ఈ టైంలో ఆ బాధ్యతను చిరు తీసుకున్నాడు. ఈ సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇలా ఇబ్బందుల్లో ఉన్న ఎవరు సాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు చిరు. గత కొన్నేళ్లలో చాలా చిత్రాలకు ఇలా గాత్రం అందించారు. కృష్ణవంశీ కోరికను కూడా ఇలాగే మన్నించి ‘రంగమార్తాండ’కు వాయిస్ ఓవర్ ఇచ్చారు చిరు. మరి ఈ సాయం సినిమాకు ఎంతమేర కలిసొస్తుందో చూడాలి.