వావ్ నివేదా.. కిలిమంజారోను ఎక్కేసింది

టాలీవుడ్ అందమైన భామ ఒకరు కఠినమైన సవాలును పూర్తి చేశారు. ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో పర్వతాన్ని టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ అధిరోహించారు. హీరోయిన్లు అంటే ఏసీ కారవాన్లలో విశ్రాంతి తీసుకునే సున్నిత వ్యక్తులు అనుకునే వారు ఇప్పటికే చాలామందే ఉన్నారు. నివేదా థామస్ తాజా ఫీట్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్.

ఎంతో ట్రెక్కింగ్ అనుభవం ఉన్నవారు మాత్రమే సాధించే ఫీట్ ను రీల్ లో గ్లామర్ సొగసులతో మనసుల్ని దోచుకునే హీరోయిన్.. సాధించడం అసాధారణ విషయమే కదా. అది కూడా ఆఫ్రికా ఖండంలో కఠిన వాతావరణ పరిస్థితులున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించటం అంత తేలికైన విషయం కాదు.

తన కెరీర్ లో మొదట్నించి రోటీన్ పాత్రలకు కాస్తంత భిన్నంగా.. తన మార్కు కనిపించేలా సినిమాలు చేసే నివేదా చివరి సినిమా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్. అందులో ముగ్గురు అమ్మాయిల్లో పల్లవి పాత్రను పోషించారు. ప్రస్తుతం మీట్ క్యూట్ లో నటిస్తున్న ఆమె.. తాజాగా ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి.. శిఖరాగ్రానికి చేరుకున్న వేళ.. తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

చిన్నతనం నుంచి నివేదాకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం. ఈ మక్కువతో ఆర్నెల్లపాటు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఆమె.. సముద్ర మట్టానికి 19,340 అడుగుల ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. అత్యంత కష్టమైన.. క్లిష్టమైన పర్యతారోహణగా దీన్ని చెబుతారు. అలాంటిది అత్యంత సాహసోపేతంగా ఆమె సాధించిన తీరు చూస్తే.. మిగిలిన గ్లామర్ భామలకు నివేదా భిన్నమని చెప్పాలి.