బాలయ్య డబ్బులన్నీ ఛారిటీకేనట

నందమూరి బాలకృష్ణ ఒక టాక్ షోకు హోస్ట్ అవుతాడని ఎవరైనా ఊహించారా? అది కూడా మెగా ఫ్యామిలీకి చెందిన ‘ఆహా’ ఓటీటీ కోసం ఆయన ఈ అవతారం ఎత్తుతాడని అస్సలు ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఊహించనిదే జరిగింది. అల్లు అరవింద్ నేతృత్వంలోని ‘ఆహా’లో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ షోకు సంబంధించి ప్రోమో కూడా రిలీజైంది. కొన్ని ఎపిసోడ్ల షూట్ కూడా పూర్తి చేశాడు బాలయ్య.

తొలి సీజన్లో 12 ఎపిసోడ్లుగా ‘అన్ స్టాపబుల్’ ప్రసారం కాబోతోందని అంటున్నారు. ఈ షో కోసం బాలయ్య తన స్థాయికి తగ్గట్లే భారీగా పారితోషకం తీసుకోబోతున్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. ఎపిసోడ్‌కు రూ.40 లక్షల చొప్పున.. మొత్తంగా రూ.4.8 కోట్ల మొత్తం రెమ్యూనరేషన్‌గా బాలయ్య పుచ్చుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

‘అన్ స్టాపబుల్’ ఒక్క సీజన్ కోసం హోస్ట్‌కే ఇంత మొత్తంలో ఖర్చు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఐతే బాలయ్య అందుకుంటున్న ఈ భారీ పారితోషకం ఛారిటీకి వెళ్లబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తోంది. ఈ షోకు తనను అడిగినపుడే బాలయ్య ఈ మేరకు నిర్ణయించుకున్నాడని.. షో సందర్భంగా తన పే చెక్‌ను ఛారిటీకి ఇవ్వబోతున్నట్లు ప్రకటన కూడా చేయబోతున్నాడని అంటున్నారు. ఇదే నిజమైతే బాలయ్యది గొప్ప మనసే అని చెప్పాలి.

ఛారిటీని దృష్టిలో ఉంచుకుని ఆహా వారు కూడా ఉదారంగా పారితోషకం ఇస్తున్నారని.. ఈ విషయాన్ని షో టైంలో ప్రకటించడం ద్వారా జనాల్లో పాజిటివిటీ పెంచి షోకు ఆదరణ పెంచేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఓవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎందరో అభాగ్యుల జీవితాల్లో వెలుగునివ్వడమే కాక.. వ్యక్తిగతంగా కూడా బాలయ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. కరోనా టైంలో కూడా బాలయ్య చేసిన సేవ ప్రశంసలందుకుంది.