‘మా’ నిషేధాలపై ప్రకాష్ రాజ్ వివరణ

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ మీద ఆయన ప్రత్యర్థి వర్గం చేసిన ప్రధాన ఆరోపణ.. ఆయన క్రమశిక్షణా రాహిత్యం గురించే. గతంలో పలుమార్లు ఆయనపై కంప్లైంట్లు రావడం.. ‘మా’ నుంచి హెచ్చరికలు అందుకోవడం.. అలాగే రెండుమూడుసార్లు నిషేధం కూడా పడటం గురించి ప్రత్యర్థులు ప్రస్తావిస్తూ.. ఇలాంటి వ్యక్తి ‘మా’ అధ్యక్షుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. దీనిపై ప్రకాష్ రాజ్ బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. ఐతే ఆలీ నిర్వహించే ఒక టీవీ షోలో ప్రకాష్ రాజ్ ఈ విమర్శలు, ఆరోపణలపై స్పందించారు.

తనపై ఎప్పుడెప్పుడు.. ఎందుకు నిషేధం పడిందో.. అందుకు దారితీసిన పరిస్థితులేంటో ఆయన వివరించే ప్రయత్నం చేశారు. మహేశ్‌బాబుతో ఒక సినిమా చేయాల్సి ఉండగా.. షూటింగ్‌ వాయిదా వేస్తూ వెళ్తుండటం వల్ల సమయానికి డేట్లు కుదరక వేరే నటుడిని తీసుకున్నారని.. కానీ పత్రికల్లో మాత్రం తనను తీసేసి వేరే నటుడిని పెట్టుకున్నారని రాశారని.. అదెలా రాస్తారని గట్టిగా అడగడంతో తనపై తొలిసారి నిషేధం విధించారని ప్రకాష్ రాజ్ వివరించారు.

ఇక శ్రీను వైట్లతో ‘ఆగడు’ సమయంలో జరిగిన గొడవ గురించి కూడా ప్రకాష్ రాజ్ గుర్తు చేసుకున్నారు. షూటింగ్‌లో శ్రీను వైట్లకు కావాల్సిన వేగం రావట్లేదని.. ఆయన ఏ మూడ్‌లో ఉన్నారో తెలియదని.. తాను సెట్ నుంచి వెళ్లిపోయానని.. కానీ తర్వాత ‘శీను రేపొకసారి కలిసి మాట్లాడదాం’ అని చెప్పానని.. కానీ తర్వాతి రోజు తన స్థానంలో సోనూసూద్‌ వచ్చారని.. ఆ తర్వాత తాను బూతులు తిట్టానంటూ నిషేధం విధించారని ప్రకాష్ రాజ్ చెప్పారు. మీకింత యాటిట్యూడ్ లేకపోయి ఉంటే ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకునేదేమో అని ఆలీ అంటే.. ఆ యాటిట్యూడ్ వల్లే తాను ఇంత బలమైన వ్యక్తిగా మారేవాడిని కాదేమో అని ప్రకాష్ రాజ్ బదులిచ్చారు. తన యాటిట్యూడ్ వల్ల ఎంత పొందానో, అంత పోగొట్టుకున్న మాట వాస్తవమని ప్రకాష్ రాజ్ అన్నారు.