షారుఖ్ ని టార్గెట్ చేస్తూ కంగనా పోస్ట్!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇండస్ట్రీలో ఫైర్‌బ్రాండ్‌ లా దూసుకుపోయే ఆమె సినీ, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. రీసెంట్ గా సమంత-నాగచైతన్య విడాకులకు ఆమిర్ ఖాన్ కారణమంటూ అతడిని మధ్యలోకి లాగేసింది. ఆ తరువాత ముంబై డ్రగ్స్ కేసు విషయంలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కి మద్దతుగా నిలిచిన హృతిక్ రోషన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. ఇప్పుడు ఏకంగా షారుఖ్ పై మండిపడుతూ పోస్ట్ పెట్టింది.

డ్రగ్స్ కేసు విషయంలో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఆర్యన్‌కి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. షారుఖ్ కూడా తన కొడుకు బెయిల్ కోసం చాలానే ప్రయత్నిస్తున్నారు. ఇండియాలో పేరున్న లాయర్ ను రంగంలోకి దింపి తన కొడుకుని జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హాంకాంక్ యాక్షన్ హీరో జాకీచాన్ కుమారుడి డ్రగ్స్ కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ షారుఖ్ ని టార్గెట్ చేసింది కంగనా.

జాకీచాన్ కుమారుడు జైసీచాన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని 2014లో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జానీచాన్ అది తన ఫెయిల్యూర్ అని అందరికీ క్షమాపణలు చెప్పాడు. కేసులో తన కొడుకుని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయనని జాకీచాన్ చెప్పాడు. అంతేకాకుండా.. జైసీచాన్ ఆరు నెలల జైలు శిక్ష అనుభవించి వచ్చిన తరువాత కూడా జాకీచాన్ అందరికీ సారీ చెప్పాడని కంగనా పోస్ట్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కంగనా ఇలా కావాలనే షారుఖ్ ని టార్గెట్ చేసి ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.