అక్కడ బాలయ్య.. ఇక్కడ సమంత


‘ఆహా’ ఓటీటీ కోసం నందమూరి బాలకృష్ణ ఒక టాక్ షో చేయబోతున్నాడని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలయ్య ఏంటి.. టాక్ షో చేయడమేంటి.. అందులోనూ మెగా ఫ్యామిలీకి చెందిన ఆహా ఓటీటీలో ఆయన షో ప్రసారం కావడం ఏంటి అని అందరూ షాకయ్యారు. కానీ చివరికి అదే నిజమని తేలింది. ఇటీవలే ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియో షూటింగ్ కూడా మొదలు కావడంతో ‘ఆహా’లో బాలయ్య కనిపించబోతుండటం నిజమేనని రూఢి అయింది.

ఇప్పడు దీనిపై అధికారిక సమాచారం కూడా వచ్చేసింది. షో గురించి ‘ఆహా’నే స్వయంగా అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ‘ది బాప్ ఆఫ్ ఆల్ షోస్’ అంటూ ఈ షోకు ఇంట్రో ఇచ్చారు. బాలయ్యను నేరుగా చూపించకుండా ఆయన లుక్‌ను షేడ్స్ ద్వారా చూపించి నందమూరి హీరో ‘ఆహా’ కనిపించనున్న సంగతి నిజమే అని తేల్చేశారు. ‘బాలయ్య ఆన్ ఆహా’ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టడంతో ఇక ఈ షో విషయంలో సందేహాలేమీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ షో తొలి ఎపిసోడ్లో మోహన్ బాబు, ఆయన పిల్లలు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న అతిథులుగా రాబోతున్నట్లు కూడా వార్తలు బయటికి రావడం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఆదివారం మరో షోలో ఓ విశిష్ఠ అతిథి పాల్గొనబోతున్న విషయం కూడా అధికారికం అయింది. జెమిని టీవీలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో సమంత పాల్గొన్న విషయం అఫీషియల్ అయింది. ఆమె ఎపిసోడ్‌ తాలూకు ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఏ రోజు ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యేది వెల్లడించలేదు కానీ.. దసరా నవరాత్రుల స్పెషల్‌గా ఈ ఎపిసోడ్‌ రాబోతోందని ప్రకటించారు. ఆరెంజ్ కలర్ టాప్‌లో చాలా హుషారుగా కనిపించిన సమంత ఈ ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది.