కొడుకు కోసం టాప్ లాయర్‌‌ని దింపిన ఖాన్

షారుఖ్ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ని డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. హత్యకేసుల్లో లోపలికెళ్లిన వాళ్లని సైతం సునాయాసంగా బైటికి తీసుకొచ్చే సల్మాన్‌ ఖాన్‌ కల్పించుకున్నా ఆర్యన్‌ని విడిపించడం కుదరలేదు. కోర్టు పద్నాలుగు రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తన చుట్టూ ఉచ్చు మరింత గట్టిగా బిగుసుకుంది. దాంతో కొడుకును కాపాడుకోవడం కోసం ఫేమస్ లాయర్‌‌ సతీష్ మాన్‌షిండేని రంగంలోకి దింపాడు కింగ్ ఖాన్.

సంజయ్ దత్, సల్మాన్‌ లాంటి బడా సెలెబ్రిటీలకు బెయిల్ సంపాదించిన లాయర్‌‌ ఈయన. ఆర్యన్‌ని సేవ్ చేయడానికి ఆయనే కరెక్టని ఫిక్సై కేసును ఆయన చేతిలో పెట్టారు. సీన్‌లో ఎంటరవుతూనే తన సత్తా చూపించడం మొదలుపెట్టాడు సతీష్. ఆర్యన్ కేసులో ఎన్సీబీ తప్పులు చేస్తోందంటూ కోర్టులో తన వాదన మొదలుపెట్టాడు. ఏడు రోజుల కస్టడీకి ఒప్పుకున్నా ఎన్సీబీ అధికారులు కేసును ఇంచ్‌ కూడా కదిలించడం లేదంటున్నాడాయన.

‘ఆర్యన్‌ని తన ఫ్రెండ్ ప్రతీక్‌ పార్టీకి పిలిచాడు. బహుశా స్టార్ కిడ్ కనుక తన పార్టీకి గ్లామర్ వస్తుందని అతను అనుకుని ఉండొచ్చు. అర్బాజ్ మర్చెంట్‌ని పార్టీకి పిలిచింది కూడా అతనే. అంతే తప్ప అర్బాజ్‌కి, ఆర్యన్‌కి అసలు సంబంధమే లేదు. పైగా ఆర్యన్, ప్రతీక్‌ల ఫోన్ చాట్‌లో అసలు డ్రగ్స్ ప్రస్తావనే లేదు. మరి ఎలా అనుమానిస్తున్నారు’ అని ప్రశ్నించిన సతీష్.. ఆర్యన్‌ని ఎన్సీబీ కావాలనే ఇరికిస్తోందంటున్నాడు.

అరెస్ట్ చేసినప్పుడు అర్బాజ్‌ దగ్గర ఆరు గ్రాముల చరస్‌ ఉంది. ఆర్యన్‌తో పాటు అరెస్టైన అచిత్‌ దగ్గర రెండున్నర గ్రాములకు పైగా గంజాయి ఉంది. ఈ వివరాలు తప్ప ఆర్యన్‌ని డ్రగ్‌ రాకెట్‌తో సంబంధం ఉందని ప్రూవ్ చేసేందుకు ఎన్సీబీ దగ్గర ఎలాంటి ఆధారాలూ లేవని, కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వాలని సతీష్ అప్పీల్ చేశాడు. మరి కోర్టు సతీష్‌ వాదనతో ఏకీభవించి బెయిల్ ఇస్తుందో లేదో చూడాలి.