టాలీవుడ్‌పై కన్నేశారు

ఓవైపు భర్త స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. మరోవైపు భార్య ఏకంగా మెగాఫోన్ పట్టి తెలుగు సినిమానే డైరెక్ట్ చేయబోతోంది. కోలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ ధనుష్, ఐశ్వర్యలు ఇలా ఒకేసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టడం చూస్తుంటే ఇద్దరూ పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారా అనిపిస్తోంది.

ఇంతవరకు తన సినిమాలను డబ్‌ చేసి తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ధనుష్.. త్వరలో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. ఆ తర్వాత చేయడానికి మరో సబ్జెక్ట్‌ని కూడా లైన్‌లో పెట్టాడు. ఇప్పుడు అతని భార్య, రజినీకాంత్ కూతురు ఐశ్వర్య కూడా తెలుగులో ఓ మూవీకి దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రకటించింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఐశ్వర్య గతంలో ధనుష్‌తో ‘3’ అనే సినిమా తీసింది. గౌతమ్‌ కార్తీక్‌తోనూ ఓ చిత్రం చేసింది. ఈసారి తెలుగువారికి తన డైరెక్షన్ స్కిల్స్ రుచి చూపిస్తానంటోంది. తమిళనాట టాప్ బ్యానర్ అయిన లైకా.. రీసెంట్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్షయ్‌ కుమార్‌‌తోను, జాన్వీ కపూర్‌‌తోను సినిమాలు నిర్మిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా ఎంటరవుతున్నందుకు సంతోషంగా ఉందంటోంది.

అయితే ఈ చిత్రంలో ఎవరు నటిస్తారు, ఏ టెక్నీషియన్స వర్క్ చేస్తారు అనేది ఇంకా రివీల్ చేయలేదు. ఎవరైనా స్టార్ హీరో యాక్ట్ చేయొచ్చు అంటున్నారు. లేదంటే ధనుష్‌తోనే తీస్తారేమోననే సందేహాలూ లేకపోలేదు. ఏదైతేనేం.. భార్యాభర్తలిద్దరూ టాలీవుడ్‌ మార్కెట్‌ మీద కన్నయితే వేశారని అర్థమవుతోంది.