అవును విడిపోతున్నాం: చై, సామ్

కొద్ది రోజులుగా టాలీవుడ్‌నే కాదు, అక్కినేని అభిమానులందరినీ కలవరపెడుతున్న వార్త.. నాగచైతన్య, సమంత డివోర్స్. ఈ క్యూట్ కపుల్‌ ఒక్కటైనప్పుడు మురిసిపోనివారు లేరు. పర్‌‌ఫెక్ట్ పెయిర్ అంటూ కాంప్లిమెంట్స్ కురిపించనివారూ లేరు. అయితే కొన్ని రోజుల క్రితం సడెన్‌గా వీరు విడిపోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అది నిజమేనని నమ్మేలా సమంత కొన్ని హింట్స్ కూడా ఇచ్చింది కానీ చైతు మాత్రం ఎక్కడా నోరు మెదపలేదు. కానీ ఇప్పుడు తాము విడిపోతున్నామంటూ ఇద్దరూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

తమ సెపరేషన్‌ని కన్‌ఫర్మ్ చేస్తూ చై, సామ్ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ‘ఎంతో ఆలోచించిన తర్వాత మేం వేరు పడాలని నిర్ణయించుకున్నాం. మా దారులు వేరైనా మా మధ్య స్నేహ బంధం మాత్రం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంది. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలబడాలని ఫ్రెండ్స్‌ని, సన్నిహితుల్ని కోరుతున్నాం’ అని నోట్‌లో రాసిన చై, సామ్.. తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరారు.

ఊహించిన విషయమే అయినా.. ఈ వార్త అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రియుల్ని కూడా కాస్త బాధపెట్టిందనే చెప్పాలి. 2017, అక్టోబర్‌‌ 7న గోవాలో నాగచైతన్య, సమంతల వివాహం జరిగింది. అందుకే ఆ రోజునే తమ విడాకుల వార్తను ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. అంతకంటే ముందు తమ విషయంలో క్లారిటీ ఇచ్చిందీ జంట.