దిల్ రాజు అక్క‌డ అలా.. ఇక్క‌డ ఇలా

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో దిల్ రాజు ఒక‌రు. ఆయ‌న చేతిలో పెద్ద ఎత్తున థియేట‌ర్లున్నాయి. ఒక నిర్మాత‌గానే కాక‌.. డిస్ట్రిబ్యూట‌ర్‌, ఎగ్జిబిట‌ర్‌గా కూడా ఆయ‌న ఏపీలో టికెట్ల రేట్ల నియంత్ర‌ణ వ‌ల్ల బాగా ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితి మారాల‌ని కోరుకుంటూ తోటి సినీ పెద్ద‌ల‌తో క‌లిసి కొంత కాలంగా ఏపీ ప్ర‌భుత్వంతో ఆయ‌న సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.

అస‌లు ఏపీలో టికెట్ల రేట్ల ర‌గ‌డ మొద‌లైందే రాజు నిర్మాణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ రిలీజ్ సంద‌ర్భంగా. రాజు ప్రొడ‌క్ష‌న్లో మ‌రిన్ని పేరున్న చిత్రాలు రావాల్సి ఉన్న నేప‌థ్యంలో సాధ్య‌మైనంత త్వ‌ర‌గా స‌మ‌స్య ప‌రిష్కారం కావ‌డం చాలా అవ‌స‌రం. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మిగ‌తా సినీ ప్రముఖుల‌తో క‌లిసి స‌మ‌స్య ప‌రిష్కారం కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు.

కానీ అనుకోకుండా ఆయ‌న మొన్న రిప‌బ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చారు. అదే వేడుక‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఊహించ‌ని రీతిలో ఏపీ ప్ర‌భుత్వం మీద విరుచుకుప‌డిపోయారు. ఆ సంద‌ర్భంగా కింద కూర్చుని ఉన్న రాజు ముసి ముసి న‌వ్వులు న‌వ్వుతూ క‌నిపించ‌డం చాలామందికి ఆశ్చ‌ర్యం క‌లిగించింది. దీని వ‌ల్ల ఆయ‌న చాలా ఇబ్బంది ప‌డ‌తార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇలా న‌వ్వ‌డం అంటే వైకాపా నాయ‌కుల్ని తిట్ట‌డాన్ని ఆయ‌న ఎంజాయ్ చేస్తున్న‌ట్లే అన్న చ‌ర్చ మొద‌లైంది.

ఐతే ఇది జ‌రిగిన కొన్ని రోజుల‌కే, బుధ‌వారం మంత్రి పేర్ని నాని.. దిల్ రాజు, ఇత‌ర సినీ ప్ర‌ముఖుల‌తో స‌మావేశం పేరుతో మ‌చిలీప‌ట్నానికి ర‌ప్పించుకున్నారు. వారితో మీటింగ్ అనంత‌రం అంద‌రినీ ప‌క్కన పెట్టుకుని ప‌వ‌న్ మీద మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. త‌న‌ను విమ‌ర్శిస్తుంటే ఏ వ్య‌క్తి అయితే న‌వ్వాడో.. అదే వ్యక్తిని ప‌క్క‌న పెట్టుకుని ప‌వ‌న్‌ను తిట్ట‌డం ద్వారా నాని త‌న ఇగో శాటిస్ఫై చేసుకున్న‌ట్లుగా క‌నిపించింది. మొన్న న‌వ్విన రాజు.. ఇప్పుడు ప‌వ‌న్‌ను విమ‌ర్శిస్తుంటే, ప‌వ‌న్ వ్యాఖ్య‌లు అని తామంతా అన్న‌ట్లుగా నాని వ్యాఖ్యానిస్తుంటే ఎలా స్పందించాలో తెలియక ముఖంపై చేయి పెట్టుకుని సీరియ‌స్‌గా ఉండిపోవ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు.