ఫోన్ లో పోసాని పై అరిచిన పవన్

జగన్‌ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడిన పవన్‌తో పోసాని మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. పవన్ వ్యక్తిత్వాన్ని, నిజాయతీని నిలదీయడానికి ముందుకొచ్చిన పోసాని.. తన విమర్శల ప్రవాహాన్ని రెండోరోజు కూడా కొనసాగించారు. పవన్ ఓ సైకో అని, ఆయనకి తన మీద పగ ఉందని పోసాని అన్నారు. ఆ పగకి కారణమంటూ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను కూడా బయటపెట్టారు.

నైట్ షెడ్యూల్ జరుగుతున్నప్పుడు ఓసారి పవన్‌ షూటింగ్‌కి రాలేదట. ఎప్పుడూ ఆరింటికే ఇంటికెళ్లిపోయే పోసాని, పెద్ద హీరో కదా అని తొమ్మిదింటి వరకు వెయిట్ చేశారట. అయినా పవన్ రాకపోయేసరికి ఇంటికెళ్లిపోయారట. పదిన్నరకి భోజనం చేస్తుంటే పవన్‌ ఫోన్ చేసి ఇంటికెలా వెళ్లిపోతావ్, నేనొచ్చేవరకు ఆగాలి కదా అంటూ అరిచారట. మీరెప్పుడో పదింటికొస్తే నేను ఉండాలా, నేనూ ఆర్టిస్టునే అని తాను సీరియస్ అయ్యానని, దాంతో ఆ సినిమా నుంచి తనని వెంటనే తీసేశారని చెప్పారు పోసాని.

‘ముప్ఫయ్యేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. పవన్‌ మీద కూడా నేను కోపం పెట్టుకోలేదు. కానీ ఆయనే, ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నామీద కోపం పెంచుకున్నారు’ అని చెప్పారు పోసాని. ఇప్పుడు పవన్‌ గురించి ఇలా మాట్లాడుతున్నందుకు ఇండస్ట్రీ తనను బ్యాన్ చేసినా పర్లేదని, తాను ఒక్క మాట కూడా అననని, అక్షయ పాత్రల్లాంటి నిర్మాతల పుణ్యంతోనే మేం అన్నం తింటున్నామని ఆయన అన్నారు.