మెహర్ రమేష్‌కు లాభాల్లో వాటా

తెలుగులో ఒక దర్శకుడు వరుసగా రెండు భారీ డిజాస్టర్లు ఇచ్చాక ఎనిమిదేళ్ల పాటు ఖాళీగా ఉండిపోయి, ఇంత గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం అందుకోవడం అనూహ్యమైన విషయం. మెహర్ రమేష్ ఈ అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ‘కంత్రి’ లాంటి ఫ్లాప్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన మెహర్.. రెండో సినిమా ‘బిల్లా’తో పర్వాలేదనిపించాడు.

అది రీమేక్ మూవీనే అయినప్పటికీ మెహర్ చాలా స్టైలిష్‌గా తీశాడనే ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలోనే మెహర్‌కు ‘కంత్రి’ లాంటి మెగా బడ్జెట్ మూవీ తీసే అవకాశం దక్కింది. కానీ ఈ సినిమాతో ఘోర పరాభవాన్నే మూటగట్టుకున్నాడతను. తర్వాత ‘షాడో’ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా ఇంకో పెద్ద డిజాస్టర్ కావడంతో తర్వాత మెహర్‌తో పని చేయడానికి ఇటు హీరోలు, అటు నిర్మాతలు భయపడిపోయారు. దీంతో ఎనిమిదేళ్ల పాటు అతడికి మరో సినిమా చేసే అవకాశం రాలేదు.

ఐతే మెగాస్టార్ చిరంజీవికి బంధువు కావడం, వ్యక్తిగతంగానూ ఆయనతో మంచి అనుబంధం ఉండటం.. కరోనా టైంలో చిరు తరఫున బాధ్యత తీసుకుని అనేక సేవా కార్యక్రమాలను నడిపించడంతో మెహర్‌కు మెగాస్టార్‌‌ను డైరెక్ట్ చేసే గొప్ప అవకాశం దక్కింది. తమిళ హిట్ ‘వేదాళం’ ఆధారంగా మెహర్ తీస్తున్న ఆ చిత్రమే.. బోళా శంకర్. ఈ చిత్రానికి మెహర్ ఎంత పారితోషకం తీసుకుంటున్నాడనే చర్చ నడుస్తోంది టాలీవుడ్లో. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ‘బోళా శంకర్’కు మెహర్ పారితోషకం తీసుకోవట్లేదట.

నెలవారీ జీతం, అలాగే లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం కుదిరిందట. ప్రి ప్రొడక్షన్ దశ నుంచి నెలకు రూ.5 లక్షల చొప్పున మెహర్‌కు జీతం అందుతోందట. రిలీజ్ తర్వాత లాభాల్లో 20 శాతం దాకా వాటా ఇచ్చేలా కూడా కాంట్రాక్ట్ చేసుకున్నారట. అంటే సినిమా బాగా తీసి హిట్ అయ్యేలా చేయాల్సిన బాధ్యత మెహర్ మీద ఉంది. సినిమాను ఎంత పెద్ద హిట్ చేస్తే అంత పెద్ద మొత్తంలో ఆదాయం తనకు దక్కుతుంది. ఈ స్థితిలో మెహర్ ఎంత మంచి ఔట్ పుట్ ఇస్తాడో చూడాలి.