భర్తతో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన శిల్పాశెట్టి!

పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడు బెయిల్ కి అప్లై చేయగా.. రెండు, మూడు సార్లు రిజెక్ట్ చేసిన కోర్టు ఫైనల్ గా అతడికి బెయిల్ మంజూరు చేసింది. రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన వెంటనే శిల్పాశెట్టి వైవాహిక జీవితానికి సంబంధించి చాలా రూమర్లు వినిపించాయి. వాటికి మరింత బలం చేకూరుస్తూ అప్పట్లో శిల్పాశెట్టి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టే పోస్ట్ లు, సింగిల్ మదర్ గా కొనసాగే ఆర్థిక స్తోమత, ధైర్యం రెండూ తనకు ఉన్నాయని చెప్పడం అనుమానాలకు దారి తీసింది.

దీంతో ఆమె రాజ్ కుంద్రా నుంచి విడిపోతుందని కథనాలను ప్రచురించారు. అయితే శిల్పాశెట్టి తన భర్త నుంచి విడిపోవడం లేదని తెలుస్తోంది. తామిద్దరం ఎప్పటిలానే అన్యోన్యంగా కలిసి ఉంటున్నామని.. ఈ మధ్య జరిగిన కొన్ని ఊహించని పరిణామాల వలన తమ మధ్య అనుబంధం మరింత పెరిగిందని అంటోంది శిల్పాశెట్టి.

భర్త నుంచి విడిపోయే ఆలోచనల వలనే.. శిల్పాశెట్టి బాలీవుడ్ లో బిజీ అవ్వాలనుకుంటుందని వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేసింది. కొన్ని విషయాలను మర్చిపోవాలంటే పనిలో పడిపోవాలని.. ప్రస్తుతం తను అదే పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది. బెయిల్ పై బయటకొచ్చిన రాజ్ కుంద్రా.. తన భార్యతోనే కలిసి ఉంటున్నారు. రాజ్ కుంద్రా అరెస్ట్ అవ్వడంతో శిల్పాశెట్టి బ్రాండ్ వాల్యూ బాగా పడిపోయింది. కోట్లలో తన ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పుడు తిరిగి తన బ్రాండ్ వాల్యూని పెంచుకునే పనిలో పడింది శిల్పాశెట్టి.