బాలయ్య రాకుంటే వెంకీ వస్తాడు

టాలీవుడ్లో సంక్రాంతి తర్వాత బాగా సందడి కనిపించే పండుగ సీజన్ అంటే దసరానే. ఐతే కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది దసరా కళ తప్పింది. థియేటర్లు పూర్తిగా మూతబడి ఉండటంతో సినిమా సందడే లేకపోయింది. ఈసారి దసరాకు రెండు నెలల ముందే థియేటర్లు తెరుచుకున్నాయి. వారం వారం బాగానే సినిమాలు రిలీజవుతున్నాయి. దసరా సమయానికి థియేటర్లు పునర్వైభవం సంతరించుకుంటాయని ఆశిస్తున్నారు.

ఐతే ఈ పండక్కి ముందు అనుకున్న భారీ చిత్రాల సందడి అయితే కనిపించేలా లేదు. ‘ఆర్ఆర్ఆర్’ ఆల్రెడీ వాయిదా పడింది. ‘ఆచార్య’ సైతం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక చివరి ‘భారీ’ ఆశ అంటే.. ‘అఖండ’నే. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి.

మొన్నటిదాకా ‘అఖండ’ దసరాకు పక్కా అంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దసరా పండక్కి నెల రోజుల మాత్రమే సమయం ఉండగా.. ఈ సినిమా రిలీజ్ గురించి అప్‌డేట్ లేదు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదన్న సమాచారం బాలయ్య అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. కొత్త షెడ్యూల్ కోసం గోవాకు వెళ్లింది చిత్ర బృందం. త్వరగా మిగతా షూటింగ్ పూర్తి చేసి..సినిమాను దసరా రేసులో నిలుపుతారన్న ఆశతో ఉన్నారు ఫ్యాన్స్. కానీ ఆ పండక్కి సినిమాకు రాదేమో అన్న అనుమానాలు మాత్రం కొనసాగుతున్నాయి.

ఒకవేళ ‘అఖండ’ దసరాకు రాని పక్షంలో మరో సీనియర్ హీరోగా విక్టరీ వెంకటేష్ సినిమా ‘దృశ్యం-2’ ఆ పండక్కి విడుదల చేస్తారని అంటున్నారు. ఈ చిత్రాన్ని ముందు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇటీవలే నిర్ణయాన్ని మార్చుకున్నారని.. థియేట్రికల్ రిలీజ్‌కు సినిమాను రెడీ చేస్తున్నారని.. వీలును బట్టి దసరాకు విడుదల చేస్తారని అంటున్నారు. దసరా వీకెండ్‌కు ఆల్రెడీ ‘మహాసముద్రం’ ఫిక్సయింది. ముందు వారం కొండపొలం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాబోతున్నాయి. మరి ఈ లైనప్ ఖాయం అవుతుందేమో చూడాలి.