తేజు యాక్సిడెంట్.. ఆర్పీ భలే చెప్పాడు


మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురి కావడం నిన్నట్నుంచి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలంటే బయట జనాల కళ్లల్లో పడకుండా లగ్జరీ కార్లలో తిరుగుతుంటారు కానీ.. తేజు మామూలు కుర్రాడిలా స్పోర్ట్స్ బైక్ వేసుకుని హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతూ ప్రమాదానికి గురి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ ప్రమాదం గురించి ముందు రకరకాల ఊహాగానాలు వినిపించాయి కానీ.. చివరికి తేజు నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడని.. సడెన్ బ్రేక్ వేయడం, రోడ్డు మీద ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయి ప్రమాదానికి గురయ్యాడని వెల్లడైంది. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ సైతం బయటికి వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదం విషయమై తేజు మీద పోలీసులు కేసు నమోదు చేశారన్న సమాచారం కూడా బయటికి వచ్చింది.

ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ప్రమాదం విషయంలో రోడ్డు నిర్మాణ సంస్థ, మున్సిపాలిటీ అధికారులపైనా కేసులు పెట్టాలంటూ ఆర్పీ డిమాండ్ చేశాడు. ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్టులో ఆర్పీ.. ‘‘సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు, అదేసమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకు పోవటానికి కారణమైన అక్కడ ఉన్న construction కంపెనీపై మరియు ఎప్పటికప్పుడు రోడ్డుని క్లీన్ గా ఉంచాల్సిన మున్సిపాలిటీ పై కూడా కేసు పెట్టాలి. ఈ కేసు వల్ల నగరంలో మిగతా ఏరియాల్లో ఇలాంటి అజాగ్రత్తలు పాటించేవాళ్లు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారు అని నా అభిప్రాయం’’ అని అభిప్రాయపడ్డారు.

ప్రమాదం విషయంలో తేజును తప్పుబడుతూ కేసులు పెట్టిన పోలీసులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపాలిటీ, నిర్మాణ సంస్థ ప్రతినిధులపై కేసులు పెట్టాలనడం పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆర్పీ చాలా సెన్సిబుల్‌గా మాట్లాడాడని ఆయన్ని పొగుడుతున్నారు.