ఆ సినిమా ఆగిపోలేదంటున్న దర్శకేంద్రుడు

వందకు పైగా సినిమాలు తీసి.. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు అందించిన దర్శకుడు రాఘవేంద్రరావు. కెరీర్ చరమాంకంలో ఆయన భక్తి బాట పట్టి అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు, షిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ లాంటి ఆధ్యాత్మిక చిత్రాలు తీశారు. చివరగా ఆయన తీసిన ‘ఓం నమో వేంకటేశాయ’ దారుణమైన ఫలితాన్నందుకోవడంతో దర్శకేంద్రుడు సినిమాలకు దూరమైపోయారు.

ఇక మళ్లీ ఆయన మెగా ఫోన్ పడతారా అన్నది సందేహమే. ఐతే దర్శకత్వం చేయకపోయినా నిర్మాతగా అయినా సినిమాలు తీయాలని అనుకున్నారు రాఘవేంద్రరావు. అందులో భాగంగానే గత ఏడాది ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లు, ఒక హీరోతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. తనకెంతో ఇష్టమైన ఎన్టీఆర్ జయంతి నాడు ఆయన ఈ సినిమాను అనౌన్స్ చేశారు.

ఈ సినిమాకు నాగశౌర్య, క్రిష్ లాంటి వాళ్ల పేర్లు వినిపించాయి. కానీ తర్వాత దాని ఊసే లేదు. ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లే అని అంతా అనుకున్నారు. కానీ దర్శకేంద్రుడు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఈ ఏడాది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన మళ్లీ ఆ ప్రాజెక్టు ఊసెత్తారు. గత ఏఢాది ఎన్టీఆర్ జయంతి నాడు తాను ఒక సినిమా గురించి అనౌన్స్‌ చేశానని.. త్వరలోనే దీని గురించి తాను వివరాలు వెల్లడిస్తానని.. ప్రేక్షకుల్ని వినూత్న రీతిలో వినోదింపజేయడానికి చూస్తున్నామని.. మరిన్ని వివరాల కోసం వేచి చూడాలని అన్నారు.

అంటే ఈ ప్రాజెక్టుకు మళ్లీ సన్నాహాలు జరుగుతున్నట్లే అన్నమాట. ఎవరున్నా లేకపోయినా.. రాఘవేంద్రుడికి అత్యంత సన్నిహితుడైన క్రిష్ మాత్రం ఈ ప్రాజెక్టులో కచ్చితంగా ఉంటాడని అంటున్నారు. ఇది సినిమా కాకపోవచ్చని.. వెబ్ సిరీస్ అయ్యుండొచ్చని అంటున్న వాళ్లూ ఉన్నారు. మరి దర్శకేంద్రుడుం ఏం క్లారిటీ ఇస్తాడో చూడాలి.