ఆచార్య.. మధ్యే మార్గం

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘ఆచార్య’ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఆ చిత్రం మే 13నే విడుదల కావాల్సింది. కానీ వైరస్ మరోసారి విజృంభించడంతో చాలా సినిమాల్లాగే ఇది కూడా వాయిదా పడింది.

సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత షూటింగ్ పున:ప్రారంభించి బ్యాలెన్స్ పార్ట్ పూర్తి చేసినప్పటికీ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా స్పష్టత రావట్లేదు. ముందేమో దసరా రిలీజ్ అన్నారు కానీ.. గత కొన్ని రోజుల పరిణామాలు చూస్తే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు.

‘ఆచార్య’ సంక్రాంతికి వస్తుందని.. కాదు కాదు క్రిస్మస్ రేసులో నిలవబోతోందని రకరకాల ప్రచారాలు జరిగాయి. ఐతే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ సినిమా ‘భీమ్లా నాయక్’.. క్రిస్మస్‌కు అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప’ రిలీజవుతుండగా.. వాటికి పోటీగా చిరు తన చిత్రాన్ని రేసులో నిలిపి వివాదానికి కారణమవుతాడని అనుకోలేం. వీలైనంత వరకు దసరా రిలీజ్‌కే ప్రయత్నిద్దామనుకున్నారు కానీ.. అప్పటికి ‘ఆచార్య’ను సిద్ధం చేయడం కష్టమేనట.

అందుకే మధ్యే మార్గంగా టాలీవుడ్ ఎప్పుడూ అంతగా దృష్టిపెట్టని మరో పండుగ మీద ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. నవంబరు తొలి వారంలో దీపావళి కానుకగా ‘ఆచార్య’ను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం చూస్తోందట. దీపావళికి తమిళం, హిందీ భాషల్లో భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. హిందీ మార్కెట్ ఇంకా పుంజుకోకపోవడంతో ఈసారి దీపావళికి చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజయ్యేలా లేవు.

తమిళంలో మాత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం ‘అన్నాత్తె’ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ చిత్రం తెలుగులో కూడా ఒకేసారి విడుదల కానుంది. మరి చిరు దీపావళికి ఫిక్సయితే.. రజినీతో తలపడబోతున్నాడన్నమాట. చిరు వెర్సస్ రజినీ.. ఎవ్వరూ ఊహించని ఈ బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.