ఆ సినిమా మొద‌లుపెట్టాక ఎన్ని క‌ష్టాలో..


సినీ రంగంలో సెంటిమెంట్ల‌కు ఉండే ప్రాధాన్యం ఎలాంటిదో అంద‌రికీ తెలిసిందే. స‌క్సెస్ రేట్ చాలా త‌క్కువ‌గా ఉండే ఈ రంగంలో సెంటిమెంటు ప‌రంగా చిన్న చిన్న విష‌యాల‌ను కూడా చాలా ప‌ట్టించుకుంటారు. ఏ ప్ర‌తికూల విష‌యం జ‌రిగినా సినిమా ఫ‌లితానికి దాన్ని ముడి పెట్టేస్తారు. అలాంటిది ఒక సినిమాను మొద‌లుపెట్టాక వ‌రుస‌బెట్టి చెడు సంఘ‌ట‌న‌లు జ‌రిగితే ఆ చిత్ర బృందం ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

సుధీర్ బాబు హీరోగా ప‌లాస 1976 ద‌ర్శ‌కుడు క‌రుణ్ కుమార్ రూపొందించిన‌ శ్రీదేవి సోడా సెంట‌ర్ సినిమా విష‌యంలో ఇలాంటి ఉదంతాలే జ‌రిగాయ‌ట‌. కొన్ని ఉదంతాల త‌ర్వాత‌ ఈ సినిమా ముందుకు క‌ద‌ల‌దేమో అన్న అనుమానాలు కూడా క‌లిగాయ‌ట‌. కానీ అన్ని అడ్డంకులనూ దాటుకుని సినిమాను పూర్తి చేసి, ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు తెస్తున్న‌ట్లు నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శి తెలిపారు.

ఈ సినిమా మొద‌లుపెట్టిన రోజు నుంచి జ‌రిగిన ప్ర‌తికూల విష‌యాల గురించి వాళ్లు మీడియాకు వెల్ల‌డించారు. మా సినిమా షూటింగ్ మొద‌లైన తొలి రోజే షూట్ కోసం తెచ్చిన‌ మెయిన్ కెమెరా కింద పడిపోయింది దీంతో అందరికీ గుండె ఆగినంత ప‌నైంది. తొలి రోజే ఇలా అయ్యింది ఏంటా అనుకున్నాం. దీన్ని ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్లాం. కానీ కార‌వాన్ దగ్గర ఓ అసిస్టెంట్ కి కరెంట్ షాక్ కొట్టింది. మళ్లీ ఇలా అయ్యిందా ఏంటా అనుకున్నాం. కానీ త‌ర్వాతి రోజే మ‌ళ్లీ ఇంకో కార‌వాన్ గొయ్యిలో ఇరుక్కుంది.

ఇలా చాలానే సంఘటనలు జరగడంతో ఏంటి ఇలా అవుతోంది అనుకున్నాం. మధ్యలో మా కుటుంబంలో ఒక‌రు చ‌నిపోవ‌డం ఇంకో పెద్ద‌ బాధాకరమైన ఘటన. అప్పుడు నెలరోజులు బ్రేక్ తీసుకున్నాం. కానీ ఈ బ్రేక్ త‌ర్వాత‌ మళ్లీ అందరం కూర్చొని ఓసారి మాట్లాడుకొని షూటింగ్ పునఃప్రారంభించాం. అప్ప‌ట్నుంచి నుంచి మళ్లీ ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ పూర్తి చేశాం అని విజ‌య్ చిల్లా, శశి తెలిపారు.