బాలీవుడ్ దర్శకుడికి వర్మ పజిల్

తన పనైపోయిందని జనాలు అనుకున్న ప్రతిసారీ ఎలాగోలా మళ్లీ ఉనికిని చాటుకుంటూనే ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ఎలాంటి సినిమాలు తీస్తున్నాడన్నది పక్కన పెడితే.. ఆయన సినిమాలు తీయడం మాత్రం మానడు. అది ఆయనకొక వ్యసనం. గత సినిమా ఫలితం ఎంత దారుణంగా ఉన్నా సరే.. ఎలాగోలా తర్వాతి సినిమాకు నిర్మాతను సెట్ చేసుకుంటాడు. పరిమిత వనరులతో, లో క్వాలిటీతో అయినా సినిమా తీసి పారేస్తాడు.

లాక్ డౌన్ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఫిలిం మేకర్స్ అందరూ కెమెరా పక్కన పెట్టేసి వేరే వ్యాపకాల్లో ఉంటే వర్మ మాత్రం చడీచప్పుడు లేకుండా కరోనా వైరస్ మీదే సినిమా తీసేశాడు. దాని ట్రైలర్ కూడా తాజాగా విడుదలైంది. ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపిస్తే.. మిగతా కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారు.. కరోనా మనుషుల్ని ఎలా భయపడుతుంది.. వారి మధ్య అంతరాన్ని ఎలా పెంచుతుందని ఇందులో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమైంది.

ఉన్నంతలో ట్రైలర్ ఆసక్తికరంగానే అనిపించింది. ఐతే ఈ సినిమా తీసింది ఎవరు అన్నది ఇప్పుడు పజిల్‌గా మారింది. ట్రైలర్ చివర్లో ‘ఎ రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ ఆఫ్ అగస్త్య మంజు డైరెక్షన్’ అంటూ ఎవరికీ అర్థం కాని టైటిల్ కార్డ్ వేశారు. డైరెక్షన్ అగస్త్య మంజు అంటూ దీన్ని వర్మ ఫిలింగా చెప్పడం ఏంటో అర్థం కావడం లేదు.

వర్మ పేరు నిర్మాతగా, మంజు పేరు దర్శకుడిగా వేస్తే అదో లెక్క. ఇలా వర్మ ఫిల్మ్ ఆఫ్ మంజు డైరెక్షన్ అంటేనే అయోమయంగా ఉంది. ఇది ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమాదిత్య మొత్వానె‌కు కూడా పజిల్‌గా మారింది. దీని అర్థమేంటో ఎవరైనా చెబుతారా అంటూ అతను ట్విట్టర్లో ప్రశ్నించాడు.

దానికి వర్మ బదులిస్తూ.. జనాలు ఇలా అడగాలనే ఉద్దేశంతోనే అలా వేశామని.. కాబట్టి తమ లక్ష్యం నెరవేరిందని చెప్పేసి సైలెంటైపోయాడు. కానీ దాని భావమేంటన్నది మాత్రం వర్మ వెల్లడించలేదు. ఏదైతేనేం అసలు ఓ మోస్తరు ఫిలిం మేకర్ కూడా వర్మ సినిమాల గురించి పట్టించుకోవడం, స్పందించడం చేయని రోజుల్లో ఒక ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ ఇలా రెస్పాండయ్యాడంటే వర్మ పబ్లిసిటీ గిమ్మిక్ కొంత వరకు పని చేసినట్లే.