ఇంత హ‌డావుడిగా సెన్సార్ చేసేశారేంటి?

లాక్ డౌన్ టైంలో తెలుగులో ఎక్కువ‌గా చ‌ర్చ‌ల్లో ఉన్న తెలుగు సినిమాల్లో నిశ్శ‌బ్దం ఒక‌టి. అనుష్క ప్రధాన పాత్ర‌లో వ‌స్తాడు నా రాజు ఫేమ్ హేమంత్ మ‌ధుక‌ర్ రూపొందించిన ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఏప్రిల్ 2న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ లాక్ డౌన్ కార‌ణంగా బ్రేక్ ప‌డింది. ఇక అప్ప‌ట్నుంచి చిత్ర బృందం ఏమీ చేయ‌లేక సైలెంటుగా ఉంది. వాళ్లు చేయ‌డానికి చిన్నా చిత‌కా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఏమీ మిగ‌ల్లేదు.

ఐతే థియేట‌ర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫాంలో నేరుగా రిలీజ్ చేసేస్తార‌ని గ‌ట్టి ప్ర‌చార‌మే సాగింది. అదేం లేదంటూ చిత్ర‌ స‌మ‌ర్పుకుడు కోన వెంక‌ట్ ఒక‌టికి రెండుసార్లు స్ప‌ష్ట‌త ఇచ్చినా ప్ర‌చారం ఆగ‌లేదు.

ఐతే నిశ్శ‌బ్దంకు సంబంధించి తాజాగా వ‌చ్చిన అప్ డేట్ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ ప‌ని పూర్త‌యింది. ఈ థ్రిల్ల‌ర్ మూవీకి సెన్సార్ బోర్డు యు/ఎ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. లాక్ డౌన్ నేప‌థ్యంలో ఆన్ లైన్ ద్వారా సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీ చేయ‌డానికి ఇటీవ‌ల ఏర్పాట్లు జ‌రిగాయి. చాలా సినిమాలు పెండింగ్‌లో ఉన్న నేప‌థ్యంలో ఒకేసారి త‌ర్వాత అంద‌రూ మీద ప‌డ‌తార‌న్న ఉద్దేశంతో ఈ వెసులుబాటు క‌ల్పించిన‌ట్లున్నారు.

థియేట‌ర్లు ఎప్పుడు తెరుచుకుని మామూలుగా సినిమాలు రిలీజ్ చేసే ప‌రిస్థితి ఉంటుందో తెలియ‌క‌పోయినా.. నిశ్శ‌బ్దం టీం మాత్రం త్వ‌ర‌ప‌డి సెన్సార్ చేయించేసింది. ఆన్ లైన్ రిలీజ్‌కు అయితే సెన్సార్ స‌ర్టిఫికేష‌న్ కూడా అవ‌స‌రం లేదు. త‌మ సినిమా నేరుగా థియేట‌ర్ల‌లోకే వ‌స్తుంద‌నే సంకేతాలు ఇవ్వ‌డానికి కూడా చిత్ర బృందం ఈ ప‌ని పూర్తి చేసి ఉండొచ్చేమో.