రామ్ వద్దనుకున్న టైటిల్ వాడేస్తున్నాడే

ఒకప్పుడు శత్రువు, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి క్లాసిక్ టచ్ ఉన్న బ్లాక్‌బస్టర్లు తీసి నిర్మాతగా తిరుగులేని స్థాయిని అందుకున్నారు ఎం.ఎస్.రాజు. ఎంఎస్ అంటే మెగా సక్సెస్ అంటూ అబ్రివేషన్లు చెప్పుకునేవాళ్లు అప్పట్లో. కానీ తనకొచ్చిన గొప్ప పేరును ఆయన నిలబెట్టుకోలేకపోయారు. వరుస ఫ్లాపులు తీసి నిర్మాతగా బాగా వెనుకబడిపోయారు. ఒక దశలో ఆయన నిర్మాణమే ఆపేశారు. ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితికి చేరుకున్నారు.

కానీ ఈ మధ్య ‘డర్టీ హరి’ అనే సినిమాతో మళ్లీ తన పేరు చర్చనీయాంశం అయ్యేలా చేసుకున్నారు. ఈ బోల్డ్ మూవీ ఓటీటీలో రిలీజై మంచి స్పందనే రాబట్టుకుంది. యూత్ బాగానే చూశారీ చిత్రాన్ని. ఆ ఊపులో వరుసగా ఇలాంటి బోల్డ్ మూవీసే తీయడానికి రాజు రెడీ అయిపోయారు. ఆల్రెడీ ‘7 డేస్ 6 నైట్స్’ అనే సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేస్తున్నారు రాజు. ఆయన కొడుకు సుమంత్ అశ్వినే ఇందులో హీరో. దీని తర్వాత చేయబోయే సినిమాను కూడా రాజు ఇప్పటికే ఖరారు చేసేయడం విశేషం. ఆ సినిమా కోసమే ‘హరి కథ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. దీన్ని రిజిస్టర్ చేయించారు కూడా. ‘7 డేస్ 6 నైట్స్’ పూర్తయి రిలీజ్ కాగానే ఈ చిత్రాన్ని మొదలుపెట్టేస్తారట.

ఐతే ‘హరి కథ’ అనే టైటిల్ కొత్తదేమీ కాదు. ఈ పేరుతో ఓ సినిమా కూడా అనౌన్స్ అయింది. కానీ తర్వాత టైటిల్ మార్చేశారు. ఆ చిత్రమే ‘నేను శైలజ’. రామ్, కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల రూపొందించిన ఈ చిత్రానికి ముందు అనుకున్న టైటిల్ ‘హరి కథ’నే. ఈ టైటిల్‌తోనే సినిమాను అనౌన్స్ చేశారు కూడా. కానీ ఏమనుకున్నారో ఏమో.. కొన్నాళ్లకు టైటిల్ మార్చేసి ‘నేను శైలజ’ అని పెట్టుకున్నారు. ‘హరి కథ’ టైటిల్‌ను తర్వాత ఇంకెవరూ వాడుకోలేదు. ఇప్పుడు రాజు ఆ టైటిల్ ఎంచుకుని సినిమా తీయబోతున్నారు.